నవతెలంగాణ-చెర్ల
సరిహద్దు చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మల్లపెంట, నడపల్లి అడవుల్లో 14 మంది హార్డ్కోర్ మావోయిస్టులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో మావోయిస్టు నిరోధక ఆపరేషన్లో ఉన్న టేక్మెట్ల, నడపల్లి, మల్లపెంట వైపు డీఆర్జీ బీజాపూర్, ఊసూర్, కోబ్రా 205, 210, సీఆర్పీయూ 196, 229 బెటాలియన్లు సంయుక్త బృందం అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టగా.. వారు పట్టుపడ్డారు. పట్టుబడిన వారిలో ఎనిమిది మంది మావోయిస్టులపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. అరెస్టయిన మావోయిస్టులంతా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న తీవ్రమైన ఘటనల్లో పాల్గొన్నవారే. వారిని బీజాపూర్ కోర్టులో హాజరుపరిచారు.
అరెస్టయిన మావోయిస్టులు..
అరెస్టయిన మావోయిస్టుల్లో కమ్లి కోడెం అలియాస్ కోడం (సీఆర్సీ కంపెనీ నెం. 02 పీపీసీఎం) రూ. 8 లక్షల రివార్డు, చైతే సోది అలియాస్ రిలో (సీఆర్సీ కంపెనీ నెం.02 పీపీసీఎం) రూ. 8 లక్షలు, జోగి సోధి అలియాస్ టోకు (సీఆర్సీ కంపెనీ నెం. 02 పీపీసీఎం) రూ. 8 లక్షలు, రాజే సోధి అలియాస్ బొడ్డోపై రూ. 8 లక్షల రివార్డు ప్రకటించారు. అదే విధంగా దేవ మడకంపై రూ.1 లక్ష, కోస మాద్వి మిలీషియా ప్లాటూన్ కమాండర్పై రూ.1 లక్షలు, లింగ కుహ్రామి అలియాస్ గెల్లె లింగపై ఒక లక్ష, హంగా కుంజం (డీకేఎంఎస్ ప్రెసిడెంట్)పై రూ.1.00 లక్షలు రివార్డు ప్రకటించారు. వీరితో పాటు డీకేఎంఎస్ సభ్యులు జోగ మడ్కం, సంఘం సభ్యుడు హుర్రా మడ్కం, పామెడ్ ఏరియా కమిటీ సభ్యుడు సోమద మడ్కం, రామ మద్వి, హంగా మద్వి, సుక్క మద్వి ఉన్నారు.