
– దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల కమిషనర్ వినూత్న ప్రయత్నం
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు అనేక సంస్కరణలు తెచ్చింది.అందులో భాగంగా దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులు అమల్లోకి తెచ్చారు. ఓటరు గుర్తింపు కార్డులు అమల్లోకి వచ్చి 28 ఏండ్లు గడుస్తుంది.1995 నాటి ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ ఓటరు నమోదు పారదర్శకంగా ఉండంతో పాటు దొంగ ఓట్లను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం కలిగించింది. ఓటరు జాబితాలో ఉన్న క్రమ సంఖ్యల ప్రకారం ఓటరు ఫొటోను కార్డుపై ముద్రించి ఇస్తున్నారు.ఐడి కార్డు, పాస్ ఫొటో సైజ్ ఫొటో, జనన తేదీ, కార్డు హోల్డర్ చిరునామా సైతం ముద్రిస్తారు. సీరియల్ నెంబరు, హోలో గ్రామ్ స్టిక్కర్,కార్డును జారీచేసిన అధికారి స్టాంప్,సంతకం కూడా ఉంటాయి. దీనిపై ముద్రిoచిన సీరియల్ నెంబర్ చాలా ముఖ్యమైంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం మారుతుంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటరు లిస్ట్ డాటాను ఆన్ లైన్ లో ఉంచినపుడు ఓటరు తమ ఎన్నికల సంఖ్య,సీరియల్ నెంబరు ను సులభంగా కనుక్కోవచ్చు. ఓటరు కార్డు ఉంటేనే ఓటు వేసే విధంగా నిబంధనలు విధించడంతో దొంగ ఓట్ల నివారణ తోడ్పాటైంది. భారతీయ పౌరసత్వం కలిగిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందడంతో పాటు, ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశాలను పలుమార్లు కల్పించారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను ఇప్పుడు డిజిటల్ విధానంతో ముద్రిస్తున్నారు.
ఓటు హక్కుపై అవగాహన..
ఓటురు గుర్తింపు కార్డు అందుబాటులోకి వచ్చాక ప్రజలకు తమ ఓటుహక్కుపై పూర్తి అవగాహన వచ్చింది.ఓటరు జాబితాలో ఓటరు ఫొటో ముద్రిoచడంతో మరింత పారదర్శకత పెరిగింది. ఓటరు గుర్తింపు కార్డు అన్నది. ప్రతి ఓటరుకు అందుబాటులోకి వచ్చింది. ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరును పోలింగ్ ఏజెంట్ సులువుగా జాబితాలో ఉన్న పేరును సరిచూసుకొని ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పిస్తున్నారు.అయితే ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులో లేనివారు పోల్ చిట్టిలో పొందపర్చిన తమ ఓటు క్రమసంఖ్య వివరాలతో కూడా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.