31న‌ ఉస్మానియా ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన

Foundation stone laying of Osmania Hospital building on 31st– ప్రయివేటును తలదన్నేలా నిర్మాణాలు
– వందేండ్ల అవసరాలకు తగినట్టు ఆధునిక సౌకర్యాలు
– పార్కింగ్‌, ఫైర్‌స్టేషన్‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్‌ ఏర్పాట్లు
– అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్‌ల కోసం ప్రత్యేక ట్రాక్‌
– మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌లో ఆధునిక పద్ధతులు : సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 31వ తేదీ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. వందేండ్ల భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు పూర్తి ఆధునిక వసతులతో ఆస్పత్రి భవన నిర్మాణం ఉండాలని ఆకాంక్షించారు. దానికోసం ఎక్కడా రాజీపడొద్దని అధికారుల్ని హెచ్చరించారు. శనివారం తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ ప్లాన్‌లో మార్పులు సూచిస్తూ, సీఎం దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రితో పాటు వైద్య కళాశాల నిర్మాణం, అక్కడి వైద్య విద్యార్థులు, బోధనా సిబ్బందికి వేర్వేరుగా హాస్టల్‌ భవనాలు నిర్మించాలని చెప్పారు. పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేప్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనీ, రాకపోకల కోసం నలువైపులా రహదారులు ఉండాలనీ, దానికోసం అవసరమైనచోట్ల ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. డార్మిటరీ, ఫైర్‌స్టేషన్‌, క్యాంటిన్‌, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశించారు. మరణించిన వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుండటంతో వారు వచ్చేందుకు రెండు, మూడు రోజులు పడుతోందనీ, అప్పటి వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌ నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలనీ, ఏదో కోల్పోతున్న భావన ఉండరాదని అన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్‌ చోంగ్తూ, ఫ్లాగ్‌ షిప్‌ ప్రోగ్రామ్స్‌ కమిషనర్‌ శశాంక, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Spread the love