– గాజాలో కమల్ అద్వాన్ ఆస్పత్రిపై ఆగని దాడులు
– లెబనాన్లో 16మంది మృతి
– ముమ్మర దాడుల్లో తుడిచిపెట్టుకుపోయిన 37 లెబనాన్ పట్టణాలు
గాజా, బీరుట్ : గాజావ్యాప్తంగా ఇజ్రాయిల్ మిలటరీ సాగిస్తున వైమానిక దాడుల్లో గత 24 గంటల్లో 33మంది మరణించారు. 86మంది గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర గాజాలోని బెయిట్ లాహియా పట్టణంలో 20మంది మృతి చెందారు. ఆ ప్రాంతంలో పాక్షికంగా పనిచేస్తున్న కమల్ అద్వాన్ ఆస్పత్రిపై మళ్లీ దాడులు జరిగాయి. ఇప్పటికే నీరు, మందులు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఆస్పత్రిలో పిల్లల వార్డుపై ఇజ్రాయిల్ జెట్లు, డ్రోన్లతో దాడి జరిపిందని, వైద్య సిబ్బంది, రోగులు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆస్పత్రి డైరెక్టర్ ఈద్ సాబా తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి పై అంతస్తులు బాగా దెబ్బతిన్నాయని, నవజాత శిశువులు కూడా గాయపడిన వారిలో వున్నారని ఆయన తెలిపారు. ఆస్పత్రిపై వరుసగా రెండు రోజుల నుండి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్మీ కొనసాగించిన దాడుల్లో గాజా నగరంలో నలుగురు, సెంట్రల్ ఏరియాలో ఆరుగురు, ఖాన్ యూనిస్ నగరంలో ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు గాజావ్యాప్తంగా 43,391మంది మరణించగా, 1,02,347మంది గాయపడ్డారు. బెయిట్ లాహియాలో జరిగిన దాడుల్లో 13మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో దాడులు జరిగాయి. మరోవైపు లెబనాన్పై కొనసాగుతున్న దాడుల్లో సోమవారం 16మంది మరణించగా, 90మంది గాయపడ్డారు. టైర్, బింట్ జెబియల్ జిల్లాల్లోని గ్రామాలపై దాడులు కొనసాగుతున్నాయి. శిధిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు లెబనాన్లో 3,002మంది మరణించారు. 13,492మంది గాయపడ్డారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ కొనసాగించిన ముమ్మర దాడుల్లో దక్షిణ లెబనాన్లో 37 పట్టణాలు పూర్తిగా తుడచిపెట్టుకుపోయాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. 40వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
గాజాకు యూఎన్ఆర్డబ్ల్యూఏ అందించే సాయం నిలిచిపోతే అక్కడ వున్న ప్రజలు కరువు కాటకాలతో అలమటించిపోతారని ఆ సంస్థ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియట్ టూమా హెచ్చరించారు. యుఎన్ఆర్డబ్ల్యుఎను మూసివేస్తే పాలస్తీనా శరణార్ధుల సమస్యను నిర్మూలించగలమని భావించడం తెలివతక్కువ ఆలోచన అని వ్యాఖ్యానించారు. గాజా దాడుల్లో తీవ్రంగా గాయపడిన, తీవ్రమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వంద మందికి పైగా రోగులను గాజా నుండి తరలించనున్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఇటువంటి సాయం అవసరమైన వారు దాదాపు 12వేల మంది వున్నారని, ఇలాంటి తరలింపులు నిరంతరంగా కొనసాగుతూ వుండాల్సిన అవసరం వుందని కూడా తాము చెబుతునే వున్నామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి రిక్ పీపర్కార్న్ చెప్పారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో, లెబనాన్లో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీన్ (పిఎఫ్ఎల్పి)కి చెందిన 60మందిని అరెస్టు చేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.