నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండుగ పూట ఓ కుటుంబంలో తీరని విషాద చాయలు అలుముకున్నాయి. సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి గాలి పటాలు ఎగురవేయడానికి వెళ్లిన ఓ 11 ఏళ్ల బాలుడు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్తో అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులు రావడంతో ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడపాలని అనుకున్నాడు 11 ఏళ్ల తనిష్క్. అందులో భాగంగా తన ఫ్రెండ్స్ తో గాలిపటాలు ఎగురవేయడానికి బిల్డింగ్ పైకి ఎక్కాడు. అక్కడ ఎగురుతున్న గాలిపటాన్ని మాత్రమే చూస్తు్న్న తనిష్క్ అనుకోకుండా విద్యుత్ వైర్లకు తగిలాడు. దీంతో కరెంట్ షాక్ తో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తనిష్క్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు.