అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు..

నవతెలంగాణ హైదరాబాద్‌: సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్‌ టీమ్‌పై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సెంట్రల్‌ జోన్‌ డీసీపీ
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా.. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.
పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్‌ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ తెలిపారు.

Spread the love