ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు వేసిన కాంగ్రెస్ మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 17 లోక్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ మొదలైంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఓటు వేసే వేళ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. కారులో వెళ్లకుండా.. వెరైటీగా ఆర్టీసీ బస్సులో వెళ్లి మంత్రి ఓటు వేశారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కును మంత్రి వినియోగించుకున్నారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కును వినియోగించుకున్నానని, అలాగే బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఓటు అనే ఆయుధం ద్వారా విధిగా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ప్రతి పౌరుడు ఓటు వేసి బాధ్యతతో ఉండాలని అన్నారు.

Spread the love