కొడుకును క‌త్తితో న‌రికి చంపిన తండ్రి

నవతెలంగాణ – సూర్యాపేట: మ‌ద్యానికి బానిస‌గా మారిన కుమారుడి ఆగ‌డాలు భ‌రించ‌లేక‌పోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధ‌లు భ‌రించ‌లేక.. క్ష‌ణికావేశంలో కత్తితో న‌రికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన చీమల సతీశ్‌(34) గ‌త కొంత‌కాలం నుంచి మ‌ద్యానికి బానిస‌గా మారాడు. ఇక మ‌ద్యం సేవించి వ‌చ్చి.. నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇబ్బందులు పెడుతూ, వారిని హింసించేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సతీశ్‌ మద్యం తాగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడ‌వ పెట్టుకుని, దాడి చేశాడు. దీంతో తండ్రి లింగయ్య ఇంట్లో ఉన్న‌ రోకలిబండతో సతీశ్ త‌ల‌పై బాద‌డంతో కింద‌ప‌డిపోయాడు. అంత‌టితో ఆగ‌కుండా మటన్‌ కొట్టే కత్తితో త‌ల‌, కుడి చేయి, ఎడ‌మ కాలుపై విచక్షణార‌హితంగా న‌రికి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో సతీశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ జి.రాజశేఖర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప‌ట్టారు. సతీశ్‌కు వివాహం కాగా, భార్య వదిలేసి వెళ్లినట్లు సమాచారం.

 

Spread the love