కట్నం కోసం పెండ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు

నవతెలంగాణ – సంగారెడ్డి: ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెండ్లి కోసం అష్టకష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. శుక్రవారం వివాహానికి సిద్ధంచేశారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో కట్నం చాల్లేదని పెండ్లి పీటలపై నుంచి వరుడు ఉడాయించాడు. ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేశాడు. స్థానికులు తెలిపిన ప్రకారం… సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్‌ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్‌ చేసి… తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దాంతో అతను పెండ్లికి నిరాకరించాడు. చివరికి ప్రేమికులిద్దరికీ పెండ్లి చేయాలని ఇరు కుటుంబాల వారూ నిర్ణయించారు. శుక్రవారం కొండాపూర్‌ మండలంలోని ఒక గుడిలో పెండ్లికి సర్వం సిద్ధం చేశారు. అనూహ్యంగా రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని పెండ్లి కుమారుడు భీష్మించాడు. అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అందరి కళ్లుగప్పి పెండ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

Spread the love