నవతెలంగాణ – హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముంబైకర్లను ముప్పు తిప్పలు పెట్టింది. రోడ్డు, రైలు మార్గాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ముఖ్యంగా ముంబైకర్ల లైఫ్ లైన్ గా పిలిచే లోకల్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. థానే రైల్వే స్టేషన్ లో ఓ లోకల్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పటికే పూర్తిగా నిండిన రైలు ఎక్కేందుకు వందలాది మంది మహిళలు ప్లాట్ ఫాంపై తోసుకోవడం వీడియోలో కనిపించింది. దీంతో రైల్వే అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత పెద్ద మహానగరానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం విచిత్రమని విమర్శించారు.