హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు.. అభిమానుల ఘనస్వాగతం

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు నేడు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు నిన్న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన టీడీపీ పార్టీకార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం, చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. బేగంపేటలో దిగిన ఆయనకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో చంద్రబాబు కారులోంచే తనను చూసేందుకు వచ్చిన వారికి అభివాదం చేశారు. మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు వేలాది మంది ఆయన కారును అనుసరించారు. ఈ సందర్భంగా అనేక మంది బేగంపేట, జూబ్లీహీల్స్ రహదారులకు ఇరువైపులా నిలబడి చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Spread the love