కదులుతోన్న ఆటోలో ఘోరం.. గొంతుకోసి మహిళ దారుణ హత్య

నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ఆటోలోనే ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఆపై, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ముంబయిలోని సాకినాకా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్‌, పంచశీల (30) అనే ఇద్దరు సోమవారం ఇక్కడి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్‌ తనవద్ద ఉన్న పదునైన ఆయుధంతో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. నిందితుడి బారినుంచి తప్పించుకునేందుకు మహిళ ఆటో దిగి పరుగులు పెట్టినప్పటికీ.. కొద్ది దూరంలోనే కిందపడిపోయింది. మరోవైపు.. అదే పదునైన ఆయుధంతో అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. మహిళ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరికీ పరిచయం ఉందని, ఆటోలో వారి మధ్య తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Spread the love