గ్రామీణ పేదలందరినీ ఒకే గొడుగు కిందకు చేర్చాలి

గ్రామీణ పేదలందరినీ ఒకే గొడుగు కిందకు చేర్చాలి– వ్యకాస జాతీయ అధ్యక్షుడు ఏ.విజయ రాఘవన్‌ పిలుపు
– వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులనూ సమీకరించాలి : ఏఐఏడబ్ల్యూయూ జాతీయ కౌన్సిల్‌ తీర్మానం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరినీ ఒక గొడుగు కిందకు తీసుకువస్తేనే కార్పొరేట్‌, కమ్యూనల్‌ శక్తులను అడ్డుకోగలమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఎ. విజయ రాఘవన్‌ అన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభ సభలో అధ్యక్షుడు ఎ. విజయ రాఘవన్‌ జెండావిష్కరణ చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తుల ప్రభావంతో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు గ్రామీణ పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని అన్నారు. పంటల సీజన్‌లో వ్యవసాయ కూలీలుగా, ఆ పనులు లేని కాలంలో వ్యవసాయేతర పనులు చేస్తున్న గ్రామీణ పేదలు మౌలికావసరాలు తీరక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను దోచి సంపన్నులకు దేశ సంపదను కట్టబెట్టే విధానాలను పాలకులు అనుసరిస్తున్నారన్నారు. ఫలితంగా హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 116వ స్థానానికి చేరిందన్నారు. 74 శాతం ప్రజలకు పౌష్టికాహారం అందట్లేదని తెలిపారు. పోషక విలువలు అందక మహిళలు, చిన్నారులు తీవ్రంగా అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనాలు పెరగటం లేదని, పెరుగుతున్న జీవన వ్యయంతో కుటుంబావసరాలు తీర్చుకోలేని స్థితిలో గ్రామీణ పేదల జీవితం దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. వంద రోజులు కల్పించాల్సిన పనిదినాలను సగటున 46 రోజులు కూడా కల్పించడం లేదని తెలిపారు. ఇది ఉపాధి పేదలకు తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. పాలకులు అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు, గ్రామీణ పేదలందర్ని ఒక గొడుగు కిందకు సమీకరించాలన్నారు.
వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానాలు క్రమంగా పుంజుకుంటున్నాయన్నారు. మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం గత పదేండ్లుగా వేగవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తెచ్చిన మూడు నల్ల చట్టాల అమలును ప్రజా పోరాటాలతో తాత్కాలికంగా వెనక్కి కొట్టగాలిగామన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్‌ కమ్యూనల్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటనలోకి వస్తున్నారన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో ఉత్తరాది రాష్ట్రాల్లో సృష్టిస్తున్న అరాచకాన్ని సహించేది లేదనే విషయాన్ని ఆయా రాష్ట్రాల ప్రజలు నిరూపించారన్నారు. బీజేపీ బలాన్ని కూడా ఎన్నికల్లో ప్రజలు తగ్గించారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటివరకు ప్రధానంగా వ్యవసాయ కూలీలను సమీకరిస్తున్నదని, మున్ముందు గ్రామీణ పేదలందరినీ ఐక్యం చేసే ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్తు కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు ఆ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ ఉపాద్యక్షులు గోవిందన్‌ మాస్టర్‌, సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, ఏఐకెేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి నాగయ్య, పి. వెంకట్రాములు, నారి అయిలమ్మ, పద్మ, జగన్‌, మచ్చ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love