అంబేద్కర్‌ సూచించిన సామాజిక విముక్తి మార్గం

నేడు దళిత బహుజనులు ఓట్ల రాజకీయాలకు పావులుగా మారి సమిధలవుతున్నారు. పార్లమెంటరీ రాజకీయాల భ్రమల్లో నుంచి ఈ వర్గం బయటపడి అంబేద్కర్‌ సూచించిన ప్రత్యామ్నాయ రాజకీయాలు, సంస్కృతి, సాంఘిక విముక్తి, ఆర్థిక సమానత్వం, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం సాధించుకోవటానికి మనం నేడు ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అంబేద్కర్‌ ఎంతో తపనపడ్డారు. ప్రజలకు అన్నం పెట్టే కీలక రంగమైన వ్యవసాయం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించాడు. ప్రభుత్వం స్వయంగా నిర్వహించే పరిశ్రమలను భారత రాజ్యాంగంలో పొందు పరచాలని సూచించాడు. కీలక మౌలిక పరిశ్రమలు, వ్యవసాయక భూమి వాటిపై హక్కులను పరిహారమిచ్చి స్వాధీన పరచుకోవాలని సూచించాడు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యవసాయక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నాడు. ఆ వ్యవసాయ క్షేత్రాలను సమిష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత, భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగుచేయాలి. ఉత్పత్తిని సమిష్టిగా పంచుకోవాలి. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించాడు. లేకుంటే ఆర్థిక అసమానతలు సృష్టించబడతాయని చెప్పాడు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలకు రుచించలేదు. అంబేద్కర్‌ ఆలోచనలను తీసిపక్కన పెట్టారు. రాజ్యాంగం ప్రజల జీవితాలకి గ్యారంటీ ఇవ్వలేదని గ్రహించిన అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో ఇలా మాట్లాడారు… ”1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తాం. మనకు రాజకీయాలలో సమానత్వం, సామాజిక, ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటాయి. రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒకే విలువ ఉంటుంది. కానీ, సామాజిక ఆర్థిక జీవితంలో మనుషులందరికి ఒకే విలువ ఉండదు. ఎంతకాలమీ వైరుధ్యాల జీవితం? ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేకుంటే వారు కష్టపడి నిర్మించిన ఈ వ్యవస్థలను అసమానతలకు గురైన ప్రజలు ఎగరకొట్టేస్తారు” అంటాడు.
దారిద్య్ర నిర్మూలనకు మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామీణ పేదరికాన్ని తొలగించి గ్రామసీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్నజాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి దక్కలేదు. భూసంస్కరణలు అమలుకాలేదు. 75సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాలు ఎవరికి దక్కాయి? ఎంతో గర్వంగా చెప్పుకొంటున్న ప్రాజెక్టులు, అభివృద్ధి, ప్రణాళికలు ఎవరికి ప్రయోజనం కలిగించాయి? గ్రామ, పట్టణ ప్రాంతాల్లో లభించే మేలైన భూమి ఎవరు ఆక్రమించారు? చట్టసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు, మరికొన్ని కీలక విభాగాల్లో ఎవరు స్థిరపడిపోయారు? కాబట్టి 75ఏండ్లనాడు వచ్చిన స్వాతంత్య్రం నిమ్నజాతులది కాదని తేలిపోయింది. అంబేద్కర్‌ ఊహలు కలలుగానే తేలిపోయాయి. అలాగే రాజ్యాంగంలో రిజర్వేషన్ల పొందుపరచిన అంబేద్కర్‌ ఒక సందర్భంలో… ”నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమిలేకుండా భూస్వాములకు కానీ మెజారిటీ ప్రజానీకం నేటికి గ్రామాల్లో భూమిలేకుండా భూస్వాములకు దాస్యం చేస్తున్నారు. వారి కోసం నేను ఏమీచేయలేకపోయాను” అంటూ ఆవేదన చెందారు అంటే భూపంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయాధారిత మనదేశంలో భూమికి, సామాజిక న్యాయానికి ఉన్న సంబంధం ఇదే. భూపంపిణీ జరగకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు, కాబోదు. సామాజిక న్యాయానికి, భూమికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే మానవ జాతికి సమస్త జీవాధారమైనది భూమి కాబట్టి అనాదిగా భూమిని ఆక్రమించుకోవటం, దోచుకోవటం జరుగుతూ వస్తోంది. ఆ భూమి మీద బతుకుతున్న మనుషుల్ని, సమస్త జీవజాలాన్నీ, మొత్తం సంపదను ఆక్రమించుకొని రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజులు ఏర్పడ్డారు. యుద్ధాలు జరిగాయి. ఇలా చరిత్రంతా మానవాళి నెత్తుటితో తడిసి ముద్దయ్యింది. చివరికి మట్టిబడ్డలయిన నిమ్నజాతి భూమి పుత్రులకి భూమి దక్కకుండా చేశారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి. వీరు భూమి సంబంధాలన్నీ మార్కెట్‌ సంబంధాలుగా మార్చారు. నేడు ప్రపంచంలో చర్చంతా భూమిపైనే. రియల్‌ ఎస్టేట్‌గా పేరుతో సాగుతున్న భూవ్యాపారం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌గా మారింది. భూమి అంటే నేల మాత్రమే కాదు, ఆనేలలోని వనరులు, ఈ మట్టిలో నుంచి శ్రమజీవులు పుట్టించిన సమస్త జ్ఞానం, సమిష్టి జీవనం, కళలు, సంస్కృతి గల భూమి నిమ్న జాతులకు దక్కాలి. ఇదే ఏకైక పరిష్కారం. ఇది జరగాలంటే అణగారిన వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమించాలి. బానీస్‌, క్యూబాతరహా సోషలిజంను ఈ దేశంలో స్థాపించుకోవాలి.
(ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి)
– షేక్‌ కరిముల్లా
  9705450705

Spread the love