జెనీవా : అంతర్జాతీయ సంబంధాలలో బహుళ ధ్రువ ప్రపంచ క్రమాన్ని నిర్మించి ‘నిజమైన ప్రజాస్వామ్యాన్ని’ సాధించటానికి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచానికి ఒక అవకాశం వచ్చిందని రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో చెప్పాడు. ”ప్రపంచంపైన తమ ఆధిపత్యాన్ని” కొనసాగేలా చేయటానికి సరికొత్త సంఘర్షణలను రెచ్చగొట్టి మానవాళిని విభజిస్తూ అటువంటి సాధ్యతను అమెరికా, దాని మిత్ర పశ్చిమ దేశాలు అడ్డుకుంటున్నాయని ఆయన తన ప్రసంగంలో చెప్పాడు. అంతర్జాతీయ సంబంధాలలో సమానత నియమాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్పటికీ తిరస్కరిస్తున్నాయని, ఇతర దేశాలను చిన్నచూపు చూస్తున్నాయని ఆయన అన్నారు.
1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి నిజమైన ప్రపంచ క్రమాన్ని నిర్మించటానికి ప్రపంచానికి ఒక అవకాశం వచ్చిందని, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో నివసించే ‘ప్రపంచ మెజారిటీ’ ప్రజలు సమానత్వాన్ని, స్వాతంత్య్రాన్నే కాకుండా వారి సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కూడా కోరుకుంటున్నారని లవ్రోవ్ చెప్పాడు. ప్రయోజనాల సమతౌల్యం ఆధారంగా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించాడు. దేశాల సార్వభౌమత్వాల సమానతను గుర్తించకుండా, దేశాలు తమను తాము అభివృద్ధి చేసుకునే హక్కును గుర్తించకుండా విధించిన ఏకపక్ష ఆంక్షలను ఎత్తివేయాలని, అలా క్యూబా, సిరియా, వెనిజుయేలావంటి దేశాలపైన విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్తమాన ప్రపంచ క్రమాన్ని అతర్జాతీయ సమాజం సమీక్షించవలసిన అవసరముందని లవ్రోవ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి తెలిపారు. అంతిమంగా అమెరికా, దాని మిత్ర దేశాలు క్రుత్రిమంగా ఇతర దేశాలను చిన్నచూపు చూడటం మానాలి. దక్షిణాది దేశాల ఆర్థిక, ఫైనాన్షియల్ స్థాయిని గుర్తించాలని, అంతర్జాతీయి ద్రవ్యనిధిలోని, ప్రపంచ బ్యాంకులోని కోటాలను, ఓటింగ్ హక్కును పున్ణపంపిణీ చేయాలని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని విస్తరించి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.