నవతెలంగాణ -ఢిల్లీ: భారత వైమానిక దళానికి మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఈ రోజు భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం హ్యాంగర్లో నిర్వహించిన ‘సర్వధర్మ పూజ’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఐఏఎఫ్తోపాటు ఎయిర్బస్కు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. C-295 విమానాన్ని IAF స్క్వాడ్రన్ నంబర్ 11లో చేర్చారు. అవ్రో-748 విమానాల స్థానంలో జెట్లను కొనుగోలు చేసేందుకు ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో భారత్ రూ. 21 వేల 935 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెండేళ్ల తర్వాత IAF చీఫ్ సెప్టెంబర్ 13న 56 C-295 రవాణా విమానంలో మొదటిదాన్ని రిసీవ్ చేసుకున్నారు. దక్షిణ స్పానిష్ నగరం సెవిల్లెలో IAFకి అప్పగించిన కొద్ది రోజుల తర్వాత, సెప్టెంబర్ 20న విమానం గుజరాత్ లోని వడోదలో ల్యాండ్ అయింది. ఎయిర్బస్ 2025 నాటికి సెవిల్లెలోని చివరి అసెంబ్లీ లైన్ నుండి ఫ్లై-అవే కండిషన్లో మొదటి 16 విమానాలను డెలివరీ చేస్తుంది. తరువాతి 40 విమానాలను రెండు కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) తయారు చేసి అసెంబుల్ చేస్తుంది. హైదరాబాద్లో ఈ విమానాల విడిభాగాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ భాగాలు వడోదరలోని ఫైనల్ అసెంబ్లీ లైన్కు రవాణా చేస్తారు.