ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ

AP assembly meetings begin– రెండున్నరేండ్ల తర్వాత శాసనసభకు చంద్రబాబు
– ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌
అమరావతి : ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం అయ్యాయి. దాదాపు రెండున్నరేండ్ల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలోకి అడుగుపెట్టారు. మొదట ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లిన ఆయన సగౌరవంగా గౌరవ సభలోకి అడుగుపెట్టారు. మొదటగా సభ్యులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేశారు. ఇక ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేత ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైసీపీ అధినేత
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్‌ సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్‌ వచ్చారు. గతంలో ఆయన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో జగన్‌ అడుగుపెట్టారు.

Spread the love