దారుణం..గర్భవతిని స్నేహితులతో కలిసి..

నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరుట్ జిల్లాలో జరిగింది. నిందితుడు తన స్నేహితుల సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మీరుట్‌ జిల్లాకు చెందిన ఓ మహిళకు 2015లో వివాహం జరిగింది. భర్తతో ఆమెకు తరుచూ గొడవలు జరుగుతుండడంతో వివాహం జరిగిన ఏడాదికే పుట్టింటికి వచ్చేసింది. అదే ప్రాంతానికి చెందిన ఆదేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. దీంతో ఆమె తనని పెండ్లి చేసుకోవాలని ఆదేశ్‌ను కోరింది. ఇందుకు ఇష్టం లేకపోవడంతో అతడు తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె కచ్చితంగా తనని పెండ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో తన ప్రియురాలిని చంపేందుకు నలుగురు స్నేహితులతో కలిసి ఆదేశ్‌ పథకం రచించాడు. దీనిలో భాగంగా.. ఒకసారి మాట్లాడాలని తన ఇంటి దగ్గరకు ఆమెను పిలిపించాడు. ఆమె రాగానే తన స్నేహితులతో కలిసి ఓ పెద్ద రాయితో దాడి చేశాడు. ఫలితంగా సదరు మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని అక్కడే వదిలి నిందితులు పారిపోయారు. మూడు రోజుల అనంతరం సమీపంలోని పొలంలో మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదేశ్‌, దీపక్‌, ఆర్యన్‌, సందీప్‌, రోహిత్‌ను అరెస్టు చేశారు.

Spread the love