కదులుతున్న రైలులోనే అఘాయిత్యం

–  బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం
భోపాల్‌ : కదులుతున్న రైలులో మహిళపై లైంగికదాడికి పాల్పడిన దారుణం మధ్యప్రదేశ్‌లో జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సుమారు 3 గంటలపాటు రైలు కోచ్‌లోనే దాక్కుని ఉన్నాడు. చివరకు రైల్వే మెకానిక్‌ బృందం తలుపు తెరవడంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేష్‌ కుష్వాహగా గుర్తించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని ఉంచెరాకు వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్‌లో 30 ఏండ్ల మహిళ ఒక ప్యాసింజర్‌ రైలు ఎక్కింది. అయితే ఈ ప్యాసింజర్‌ రైలు పట్కారియా స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో వాష్‌రూమ్‌ అవసరాల కోసం ఆ మహిళ అదే స్టేషన్‌ లో వేరొక ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఒక స్పెషల్‌ ట్రైయిన్‌లోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది. ఈ మహిళను వెంబడిస్తూ వస్తున్న కమలేష్‌ కుష్వాహ కూడా ఆ ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి డోర్‌ లాక్‌ చేశాడు. ఆ కంపార్ట్‌మెంట్‌ అంతా ఖాళీగా ఉంది. ఆ స్పెషల్‌ ట్రైయిన్‌ కదలడం ప్రారంభించగానే మహిళపై దారుణానికి ఒడిగట్టా డు. ఈ క్రమంలో మహిళను కొట్టి, చిత్ర హింసలకు గురిచేశాడు. చంపేస్తానని బెదిరించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధిత మహిళ కిందకు దిగి ఒక ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు తనపై జరిగిన దారుణాన్ని తెలిపింది. సిబ్బంది కోచ్‌ వద్దకు వచ్చే సరికి రైలు బయలుదేరి వెళ్లిపోయింది. మరోవైపు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రావడం చూసిన కమలేష్‌ కోచ్‌ తలుపులకు తాళం వేసి అందులో దాక్కున్నాడు. దీంతో స్టేసన్‌ మాస్టర్‌ తరువాత స్టేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కూడా రోడ్డు మార్గంలో బయలుదేరింది. రైలు రేవా స్టేషన్‌కు చేరుకున్న తరువాత అక్కడి మెకానిక్‌ బృందం సహాయంతో తలుపుల్ని తెరిచారు. దీంతో కమలేష్‌ను అరెస్టు చేసి పోలీసులు కట్నికి తీసుకుని వచ్చారు.

Spread the love