తిరుపతిలో దారుణం… గంజాయి మత్తులో చిన్నారిని చిదిమేసిన యువకుడు

నవతెలంగాణ తిరుపతి: గంజాయి మత్తులో ఓ యువకుడు చిన్నారిని చిదిమేశాడు. మృగమయ్యాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేండ్ల చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేసి, హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. బిహార్‌ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్‌మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అలా పనిచేసే ఒక దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్‌(20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి.. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్‌రావు, శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు. నిందితుడు లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దిలీప్‌ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపినట్టు తెలిసింది.
గంజాయి మత్తులో నిందితుడు బాలికపై లైంగికదాడి, హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి దిలీప్‌ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు.

Spread the love