కరోనా చికిత్సతో ముదురు నీలి రంగులోకి శిశువు కళ్లు!

నవతెలంగాణ – హైదరాబాద్
కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఓ ఆరు నెలల శిశువు కళ్లు ముదురు నీలి రంగులోకి మారిన ఘటన థాయ్‌ల్యాండ్‌లో వెలుగు చూసింది. ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వివరాలు ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ జర్నల్‌తో తాజాగా ప్రచురితమయ్యాయి. ఓ రోజున చిన్నారికి జ్వరం, దగ్గూ రావడంతో కొవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, వైద్యులు చిన్నారికి ఫెవిపిరావిర్ టాబ్లెట్స్ వాడాలని సూచించారు. మందు వాడటం మొదలెట్టిన తరువాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితే, తొలి డోసు వేసుకున్న 18 గంటల తరువాత శిశువు కళ్లు నీలి రంగులోకి మారిన విషయాన్ని గమనించిన తల్లి వైద్యులకు తెలియజేసింది. దీంతో, ఫెవిపిరావిర్ మందు వినియోగం తక్షణం నిలిపివేయమని వైద్యులు సూచించారు. ఆ తరువాత మరో అయిదు రోజులకు బిడ్డ కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘‘కళ్లు మినహా చర్మం, గోళ్లు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, కళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి’’ అని జర్నల్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, చిన్నారులకు కొవిడ్ ట్రీట్‌మెంట్‌గా ఫెవిపిరావిర్‌ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.

Spread the love