నవతెలంగాణ హైదరాబాద్: మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి ఇంకా కోలుకోని తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘రాబోయే 5 రోజుల్లో కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అదేవిధంగా.. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. కోయంబత్తూర్ జిల్లాల్లోని నీలగిరి, ఘాట్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని, చెన్నై, విరుదునగర్, శివగంగ, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. ఇక నగరంలో వర్షాల కారణంగా 20 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం చెన్నైలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గాయి. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినప్పటికీ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు.