బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి: సీపీఐ(ఎం)

– సింగరేణికి నేరుగా కేటాయించాలి..
 నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బొగ్గు గనుల వేలం పాట ఆపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని అన్నారు. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్వహించిందన్నారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలికానీ, వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయమన్నారు. పైగా సింగరేణిని ప్రయివేటీకరించబోమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు. క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతున్నదని విమర్శించారు.
తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు కదలాలని కోరారు. నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (నగదీకరణ) పేరుతో దేశంలో రూ.6 లక్షల కోట్ల విలువైన ఆస్థులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రూ.28,747 కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. గత పదేండ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టిందన్నారు.  దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలం అన్నారు. దేశవ్యాపితంగా 10వ విడతలో 61 బొగ్గు బావులను వేలం వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్ నుండి 8మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికై బొగ్గుగనుల శాఖా మంత్రిగా ఉండి కూడా సింగరేణిని దివాళా తీయించేవిధంగా  బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్ కార్మికులకు, మరో 26 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. రికార్డు స్థాయిలో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్నదని అన్నారు. గత పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ రూపంలో రు. 49,666 కోట్లు చెల్లించిందని, ఇందులో కేంద్రానికి రు.26 వేల కోట్లు చెల్లించగా, రాష్ట్రానికి రూ.23 వేల కోట్లు చెల్లించిందని, ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వాలకు ఆదాయపు వనరుగా ఉందన్నారు. సింగరేణి రు.35 వేల కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో నడుస్తున్నదని, యేటా రెండు నుండి మూడువేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్న బొగ్గు పావులను ప్రయివేటు పరం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం కోల్మైన్స్ చట్టాన్ని, మినరల్స్, మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాలకు సవరణలు ప్రయివేటు సంస్థలకు అనుగుణంగా చేసిందన్నారు. సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయిని, కొత్త బ్లాకుల్లో తవ్వకాలు ప్రారంభించాలన్నారు. కాని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నదని, తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. వేలం పాట ప్రారంభం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇది వేలంపాట ప్రక్రియకు ఆమోదించడమే కదా అని ప్రశ్నించారు. గతంలో ప్రయివేటు సంస్థలకు అప్పగించిన మరో రెండు బ్లాకుల్లో ఇప్పటికీ తవ్వకాలు ప్రారంభం కాలేదని,  అందువల్ల శ్రావణపల్లి బ్లాకుతో పాటు, ఆ రెండు బ్లాకులను కూడా తక్షణం సింగరేణికే అప్పగించాలని ప్రభుత్వం ఎత్తిస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
ఇందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టవద్దు. సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమాయత్తం చేయాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేస్తున్నదని అన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డికి సమర్పించడం జరిగింది. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కో లిశెట్టి యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపిజిల్లా కమిటీ సభ్యులు జిల్లా పెళ్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, మేకనబోయిన శేఖర్, వట్టెపు సైదులు, మిట్టగనుపుల ముత్యాలు, మేకన బోయిన సైదమ్మ, పులుసు సత్యం, పల్లె వెంకట్ రెడ్డి, చిన్నపంగా నరసయ్య, ఎల్గూరి గోవింద్ బెల్లంకొండ సత్యనారాయణ,ప్రజా సంఘాల నాయకులు ములకలపల్లి రాములు,రణపంగా కృష్ణ, షేక్ సైదా, చందా చంద్రయ్య, నాగటి చిన్న రాములు, పోసనబోయిన హుస్సేన్, మాలోతు బాలు నాయక్ ,వల్లపు దాసు సాయికుమార్, షేక్ ఖాజాబీ, నందిగామ సైదులు, దేవరకొండ యాదగిరి,సోమ పంగ జానయ్య, కోడి ఎల్లయ్య, అరవ పల్లి లింగయ్య, మామిడి పుల్లయ్య, స్టాలిన్ రెడ్డి, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, ఆరే రామకృష్ణారెడ్డి, వీరబోయిన వెంకన్న, తుమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love