నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఇద్దరు ప్రయాణీకులు విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తమ వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. అయితే చెన్నై విమానాశ్రయంలో విమానం లాండ్ అయిన వెంటనే అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు ప్రయాణీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి కొచ్చి నుంచి 171 మంది ప్రయాణీకులతో శనివారం అర్ధరాత్రి ఇండిగో ఎయిర్లైన్స్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తానంటూ బెదిరించాడు. ఇదంతా గమనించిన తోటి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పైలెట్లు ఈ విషయాన్ని చెన్నై ఎయిర్ పోర్టు భద్రతా అధికారులకు తెలియజేశారు. చెన్నై విమానాశ్రయంలో విమానం లాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేశారు. ఆదివారం వేకువజామున ఐదు గంటల ప్రాంతానికి తనిఖీలు పూర్తి చేసిన భద్రత అధికారులు బాంబు లేదని తేల్చారు. కాగా, ప్రయాణీకులను భయాందోళనకు గురిచేసిన అమెరికా, కేరళ ప్రయాణీకులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.