– దేశంలో తెలంగాణను అగ్ర స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దే
– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
– రూ. 170 కోట్లతో అభివృద్ధి పనులు
నవతెలంగాణ-షాద్నగర్
మరో 15 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రూ.15 కోట్లతో కేశంపేట రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. పాత జాతీయ రహదారి విస్తరణ రెండో భాగానికి రూ.45 కోట్లతో శంకుస్థాపన చేశారు. తరువాత అత్యాధునికంగా ముస్తాబైన పట్టణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి చటాన్ పల్లి రోడ్డుకు చేరుకొని రైల్వే ఫ్లై ఓవర్కు రూ. 95 కోట్లతో శంకుస్థాపన చేశారు. అటు నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన ప్రయాణికుల విడిది భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలతో ప్రాణాలకు తెగించి తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు దొంగల్లా తెలంగాణలోకి జొర బడ్డారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని తమ తమ పాలనలో దివాలా తీయించిన పార్టీలు ఈ రెండేనని ఆరోపించారు. బిజెపి రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడుపుతుందే తప్ప దేశానికి తాము ఏం చేశారో చెప్పడం లేదని అన్నారు. ప్రయివేటీకరణలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2వేల పింఛన్, రూ. 200లకు పడిపోతుందని, రైతుబంధు ఎత్తివేస్తారని, కరెంటు కోతలు మళ్లీ మొదలువుతాయని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. గ్రామీణ ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యే ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి, డిసిఎంహెచ్ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్, పురపాలక చైర్మన్ కొందూటి నరేందర్, కొత్తూరు పురపాలక చైర్మన్ బాతుక లావణ్య దేవేందర్, మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్య, ఎంపీపీలు రవీందర్ యాదవ్, ఇద్రీస్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప రాములు, ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, పురపాలక వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్, శ్యామసుందర్ రెడ్డి, వి .నారాయణరెడ్డి, బెంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ కవిత మన్నె నారాయణ, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ బిఆరెస్ పార్టీ నాయకురాలు రాజ్యలక్ష్మి, సుష్మా రెడ్డి, కౌన్సిలర్లు జూపల్లి కౌలస్య శంకర్, సర్వార్ పాషా తదితరులు పాల్గొన్నారు.