నవతెలంగాణ గురజాల: గురజాల మండలం జంగమహేశ్వరం గ్రామంలో దారుణహత్య జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిపై ప్రత్యర్థులు వేట కొడవళ్ళుతో దాడి చేసి హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… కృష్ణారెడ్డి పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వైన్ షాప్లో విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో సంగమేశ్వరం వద్ద కృష్ణారెడ్డిపై అప్పటికే మాటువేసి ఉన్న ప్రత్యర్థులు ఐదుగురు కండ్లల్లో కారం చల్లి, వేట కొడవళ్లు, గొడ్డలతో అతి దారుణంగా హత్య చేశారు. జంగమహేశ్వర గ్రామంలో జరిగే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో కృష్ణారెడ్డి చురుగ్గా పాల్గొంటారని స్థానికులు తెలిపారు. ఈ హత్య రాజకీయ కోణమా ? ఇంకా ఇతరమైన కారణాలా ? అనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గురజాల మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన జంగమహేశ్వరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.