మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. మనసు లేనిదే మనిషి లేడు. మన మనసే మనకు మార్గం చూపే దీపం. పుస్తకాల నుంచి మనం పొందేది విజ్ఞానం అయితే మన మనసుతో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. మన బుద్ధికి, మన మనసుకి నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. మనం ఇతరుల కష్టాల్ని అర్ధం చేసుకోవాలంటే వారు చెప్పేవి మనసుతో వినాలి. మనసు బాధ పడుతున్నప్పుడు ఇంకో తోడు కావాలి. మన మనసులోని భావాల్ని అర్ధం చేసుకునే మనసు కావాలి. మనసుపై అనేక పాటలు రాసి ఆత్రేయ ‘మనసుకవి’ అని పేరు తెచ్చుకున్నారు. ఈ మనసు ఒక భోషాణం లాంటిది.
మనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలిగురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ… పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ’లోచనం’ చేసేదే మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాళమే మనసు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఆ సమయంలో ఎవరి సలహాను మనసు పరిగణనకు తీసుకోదు. అయితే ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యకు సంబంధించినదై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గతంలో చేసిన పనుల గురించి కావచ్చు.
ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కానీ, కొన్ని కోరికల గురించి కానీ జరుగుతుంటోంది. ఈ ఆలోచనా ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు. అప్పుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితులైన వారి సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా మన చుట్టూ జరిగేదే.
ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని ‘గురువు’ అంటారు. కేవలం మనుషులే కాదు ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలిస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా మనకు గురువే. కొన్ని సందర్భాల్లో మన మనసు చెప్పింది వినకుండా ప్రలోభాలకు లోనవుతాం. చుట్టూ ఉన్న పరిస్థితులు మనసుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలే చూడండీ… ఐదేండ్లు మనల్ని పాలించే నాయకులను ఎన్నుకోవల్సినది మనమే కదా! మనల్ని పాలించే సరైన వ్యక్తి ఎవరో మనం మన మనసుతో ఆలోచించాలి. ప్రలోభాలకు గురైతే మరో ఐదేండ్లు తిప్పలు పడాల్సిందే. కనుక మన మనసును కూడా మన గురువుగానే పరిగణించాలి. మనసు కూడా ఓ లోచనమే అని గుర్తించాలి. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే, మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటే మనం మనంగా బతకలగుతాం.
వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైనది ఉండదు. ఒక వ్యక్తి సమయ పాలన పాటించడాన్ని బట్టే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలిగితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఆ పనికి ఏ మాత్రం విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోతే ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే కదా! అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి లేదా వ్యవస్థ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందిస్తూ ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే ఆ సేవలు సమయానికి ఉపయోగపడితే సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. అలా సదభిప్రాయం ఏర్పడితే ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించిందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం గడువులోపులో పనిని పూర్తి చేయగలిగితే అవసరాలకు అంతరాయం కలగదు.
బాల్యం, యవ్వనం, వృద్దాప్యం ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరం అలసి పోతుంది. దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సాయపడతాయి. ఎంత శ్రద్దపెట్టి చదివితే అంత గుర్తింపు.
కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్ట ఫలితం మరొక కాలంలో కనబడుతుంది. అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి. అందుకు శ్రమించాలి అంటారు పెద్దలు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి వ్యాయామంతో దృఢంగా తయారయితే, ఆ దృఢత్వం అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే తర్వాత కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే తర్వాత కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు. ఈ విధంగా కాలం వ్యక్తి జీవితంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. అందుకే కాలాన్ని బంగారంతో పోల్చారు. అందుకే కాలం చాలా విలువైనది. ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు. ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది అనేది మాత్రం సత్యం. అందుకే అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే కరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురావడం జరిగే పని కాదు.
కానీ, లగ్జరీ సెగ్మెంట్లో మాత్రం.. టైలర్ కుట్టు మిషన్ చక్రం తిప్పుతూనే ఉన్నాడు. షర్టు.. అక్షరాలా పదివేల రూపాయలు. ప్యాంటు.. పద్దెనిమిదివేలా ఐదొందలు, జాకెట్.. నలభై ఐదువేలు. సూటు.. డెబ్బై వేలకు తగ్గదు. ఇవన్నీ ధరలు కాదు. కుట్టు కూలీలు. ‘లగ్జరీ టైలర్స్’కు సమర్పించుకోవాల్సిన బిల్లులు. ఒకవైపు బ్రాండెడ్ రెడీ-టు-వేర్ సెగ్మెంట్ దూసుకుపోతున్నా.. లగ్జరీ టైలర్ల హవా కొనసాగుతూనే ఉంది. ఈ ‘లగ్జరీ టైలర్లు.. పాత రూల్స్కు పాతరేస్తారు. కొత్త డిజైన్స్కు జాతర చేస్తారు. డిజైనింగ్లో ఆడ, మగ అంతరంగం తగ్గిస్తారు. దుస్తుల్లో వ్యక్తిత్వం ప్రతిబింబించేలా చూస్తారు’ అంటారు నవతరం టైలరమ్మలు. పాతతరం టైలర్లు బ్రాండింగ్ను పట్టించుకోలేదు. ఈ తరం దర్జీ బాబులు ఆ విషయం మీద బాగా దష్టి పెడుతున్నారు. కస్టమర్లు కూడా ప్రయోగాలను ఇష్టపడుతున్నారు. అదే సమయంలో.. అలనాటి మహారాజులను, జమీందార్లను తలపించే సంప్రదాయ వస్త్రాలకూ ఆదరణ పెరుగుతున్నది. ఆ పాతకొత్తల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు మనవాళ్లు. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ, కుట్టుపనికి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించాల్సిన అవసరం వచ్చింది.
”రైతుతో పోటీ పడగలిగినవాడు/ ఈ ప్రపంచంలో టైలరొక్కడే/ రైతు రాయి వస్త్రాన్నిస్తే టైలరు దాన్ని శిల్ప సంస్కారంగా మారుస్తాడు…/ హైబ్రిడ్ కన్నా దేశీయ ఆహారం మేలు/ మిల్లు డ్రస్సుల కన్నా మిషను బట్టలు హాయి…” అని కవి అన్నట్టు చేనేతకు చేయూత ఇస్తున్నట్టు దర్జీలకు ఆదరణ పెరగాలి.