విశ్వ వ్యాధుల భారం అధ్యయనం ప్రకారం మానసిక వ్యాధుల కారణంగా తల్లులు తమ 15 ఏండ్ల విలువైన, ఉత్పత్తిదాయకమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ కారణంగా జరిగే ఆర్ధిక నష్టం కూడా తక్కువేమీ కాదు. 2019లో ఈ నష్టం 1.3 ట్రిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా వెయ్యబడింది. ఇది 2030కి 3 ట్రిలియన్లు అవుతుందని అంచనా వేయబడుతోంది.
తల్లి మానసిక ఆరోగ్యం అంటే?
గర్భం, ప్రసవం, ప్రసవం తర్వాత ఏడాది వరకు తల్లి ఉద్వేగ, మానసిక, సాంఘిక స్వస్ధతను తల్లి మానసిక ఆరోగ్యంగా పరిగణింపబడుతుంది. మాతృత్వం సిద్ధించే క్రమంలో తల్లి పొందే అనేక అనుభవాలు, అనుభూతులు, ఎదుర్కొనే వివిధ సవాళ్ళు ఈ పరిధిలోకి వస్తాయి. సంతోషం, సంతృప్తి, ఉత్సాహం మాత్రమేకాక రాగల ఒత్తిడి, ఆందోళన, మానసిక అవాంతరాలు కూడా ఇందులో చేరతాయి. మానసిక అనారోగ్యాల ప్రభావం వారి భావోద్వేగ స్వస్ధత పైనేకాక, వారి రోజువారీ కార్యకలాపాల నిర్వహణపై, తన బిడ్డతో సరైన బంధాన్ని పెంపొందించుకోవడం, బిడ్డ సంరక్షణ, పెరుగుదలపై కూడా పడుతుంది.
గర్భం భావోద్వేగాల రంగుల రాట్నం
ఒక కొత్త జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చే క్రమంలో స్త్రీలలో, ముఖ్యంగా మొదటిసారి గర్భందాల్చిన గర్భిణులలో ఎంతో తీవ్రమైన ఆందోళన, అనిశ్చితి, భయం ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, శారీరక అసౌకర్యం భావోద్వేగ పరిస్ధితిపై మరింత ప్రభావాన్ని చూపుతాయి. తల్లి అవుతున్న క్రమంలో స్వీయ గుర్తింపు, సొంత ఆలోచన, ఆత్మగౌరవం, శరీర ఆకృతిలో మార్పు, తను నిర్వహించవలసిన పాత్రలలో మార్పు ఆమెను అలజడికి గురిచేస్తాయి. ప్రసవం ఎలా అవుతుందో అనే ఆందోళన, ప్రసవ నొప్పుల గురించి భయం, ప్రసవం సమయంలో తనకూ, తన బిడ్డకు ఏ ప్రమాదాలు ముంచుకు వస్తాయోననే భయం గర్భిణిని నలిబిలి చేస్తాయి.
ప్రసవం తర్వాత బిడ్డను సవ్యంగా సంరక్షించుకోలేనేమోననే భయం, బిడ్డసంరక్షణలో కలిగే శారీరక శ్రమ, నిద్రలేమి ఆమె మానసిక స్ధితిని కుదిపేస్తాయి. మానసిక కల్లోలం, కన్నీళ్లు కార్చడం, తల్లిగా తన బాధ్యతల్ని నిర్వర్తించలేనని నిస్పృహ చెందడం (బేబీ బ్లూస్) ఉంటాయి.
తల్లి మానసిక ఆరోగ్య లోపాలు
గర్భిణులకు, బాలింతలలో సాధారణంగా కనిపించే డిప్రెషన్, ఆందోళనతో పాటు తీవ్రమైన సమస్య ప్రసవానంతర సైకోసిస్. ఇలాంటి మానసిక అనారోగ్యాలు వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంటాయి. అంతేకాక వారి జీవన నాణ్యతను కూడా దెబ్బ తీస్తాయి.
పెరినేటల్ డిప్రెషన్
లక్షణాలు: గర్భం సమయంలో, ప్రసవం తర్వాత ఏడాది వరకు ఉండే కుంగుబాటు లేక డిప్రెషన్ని పెరినేటల్ డిప్రెషన్ అనొచ్చు. నిరంతర విచారం, ఏం చేయాలన్నా ఆసక్తి లోపించడం, దేనిలోనూ ఆనందం లేకపోవడం, నిద్రా భంగం, ఆకలి సక్రమంగా లేకపోవడం, తనని తాను దేనికీ పనికి రాననుకోవడం లేక అపరాధ భావన, తన బిడ్డతో బంధాన్ని ఏర్పరచుకోవడం కష్టమవడం మొదలైనవి ఉంటాయి.
సంకేతాలు: సాంఘిక కార్యక్రమాలకు దూరమవడం, తరచుగా ఏడవడం, ఏకాగ్రతను కోల్పోవడం, విపరీతమైన చిరాకు, బిడ్డతో ఒంటరిగా ఉండడానికి భయం, బిడ్డను సాకడంపై ఆసక్తి లేకపోవడం.
పోస్ట్పార్టమ్ ఏంగ్జయిటీ డిజార్డర్స్
జనరలైజ్డ్ ఏంగ్జయిటీ డిజార్డర్ (జి.ఎ.డి), పేనిక్ ఏంగ్జయిటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఒ.సి.డి) పోస్ట్పార్టమ్ ఏంగ్జయిటీ డిజార్డర్స్లో భాగం.
లక్షణాలు: అంతులేని విచారం, బిడ్డ ఆరోగ్యం గురించి, భద్రత గురించి అహేతుక భయాలు, దూసుకు వచ్చే అసంగత ఆలోచనలు, చిరాకు, అస్ధిమితం, నిద్రపట్టడం కష్టమవడం, గుండెదడ, మైకం రావడం, ఊపిరి అందకపోవడం, చెమటలు పట్టడం మొదలైన ఆందోళన తాలూకు భౌతిక లక్షణాలు ఈ మానసిక రుగ్మతలో ఉంటాయి. ఇవి తల్లిగా చెయ్యాల్సిన బిడ్డ సంరక్షణ, ఇతర బాధ్యతల్ని నెరవేర్చడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇలాంటి ఒత్తిడి, ప్రతికూలత, భావోద్వేగ సవాళ్ళను తట్టుకోగల మానసిక దృఢత్వాన్ని, శక్తిని పెంపొందించుకోవడం సాధారణ విషయం కాదు. ధ్యానం, దీర్ఘంగా శ్వాసతీసుకోవడం, శారీరక శ్రమ, సాంఘిక సపోర్టును కోరడం, ఆరోగ్య సంరక్షకులను సంప్రదిస్తూ ఉండడం వీటిని తట్టుకోవడానికి తోడ్పడతాయి.
సంకేతాలు: పదే పదే బిడ్డ ఎలా ఉందో చూడడం, ఇంట్లోనుండి బయటికి వెళ్ళకుండా వుండడం, పానిక్ ఎటాక్స్, కండరాలు బిగిసిపోవడం లేక జీర్ణవ్యవస్ధ సమస్యలు.
పోస్ట్పార్టమ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్
లక్షణాలు: బిడ్డ భద్రత, శ్రేయస్సు గురించి హృదయాన్ని కకావికలు చేసే ఆలోచనలు, బిడ్డకు హాని సంబంధిత మనోదృశ్యాలు, పదే పదే చేసిన పనినే చెయ్యడం, ఉదా: చేతుల్ని అదే పనిగా కడుక్కోవడం, తీవ్రమైన ఆందోళన.
సంకేతాలు: రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగేలాగా పదే పదే ఒకే పనిని చెయ్యడం, తనను ముంచెత్తుతున్న ఆలోచనల గురించి తీవ్రమైన కలవరం, నియంత్రణ లేని భావోద్వేగాలు.
పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్
లక్షణాలు: గతంలో జరిగిపోయిన ఘటనలు, అనుభవాలు పదే పదే గుర్తుకు రావడం, బాధాకరమైన ప్రసవ అనుభవం పీడకలలు, మితిమీరిన అప్రమత్తత, భావోద్వేగ జడత్వం.
సంకేతాలు: వైద్యానికి సంబంధించిన స్ధలాలకు దూరంగా ఉండడం, ప్రసవం గురించి చర్చలను నివారించడం, దిగ్భ్రాంతి చెందడం, నిద్రించడం కష్టమవడం, మానసిక కల్లోలాలు.
పెరినాటల్ బైపోలార్ డిజార్డర్:
లక్షణాలు: ఉన్మాదం కొంతసేపు, ఆవెంటనే డిప్రెషన్, అలా ఒకదాని వెంట మరొకటి ఉండడం, నిద్ర అవసరం తగ్గడం, ఆలోచనలు దూసుకు రావడం, ఆకస్మిక ప్రతిస్పందన, చిరాకు.
సంకేతాలు: తీవ్రమైన మనో సంచలనాలు, నిర్లక్ష్య ప్రవర్తన, ఇంట్లోను, పని చేసే ప్రదేశంలోనూ సవ్యంగా వ్యవహరించకపోవడం, సైకోసిస్ (తీవ్రంగా ఉన్నప్పుడు భ్రాంతులు, భ్రమలు)
పోస్ట్పార్టమ్ సైకోసిస్
లక్షణాలు: భ్రాంతులు, భ్రమలు, తీవ్ర ఆందోళన, గందరగోళం, మతిస్ధిమితం లేకపోవడం, వేగంగా మూడ్ మార్పులు, తనకు లేక తన బిడ్డకు హానిని కలిగించే, అత్మహత్య, లేక హత్యను ప్రేరేపించే ఆలోచనలు.
సంకేతాలు: వింత ప్రవర్తన, అస్పష్టత, నిద్రకు తీవ్ర ఆటంకాలు, అర్ధం లేకుండా మాట్లాడడం లేక ఆలోచించడం.
పైలక్షణాలు ఏవైనా కొన్ని ఉన్నంత మాత్రాన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు భావించకూడదు. కానీ అవి దీర్ఘకాలంగా ఉన్నా, వాటి వలన ఆ స్త్రీ దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నా, అవి ఆమెను బాధిస్తున్నా వెంటనే మానసిక చికిత్సలో అనుభవం ఉన్న వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించాలి. సకాలంలో వైద్యం చేయంచుకోవడం వల్ల త్వరగా కోలుకుని తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
తల్లి మీద, బిడ్డ మీద తల్లి మానసిక ఆరోగ్యం ప్రభావం:
భావోద్వేగపరమైనవి: తల్లి మానసిక ఆరోగ్యం సజావుగా లేకపోతే ఆమెకు తీవ్రమైన విచారం, ఆందోళన, నిరాశ కలుగుతాయి. తీవ్రమైన అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు మొదలైన శారీరక ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మ గౌరవం, స్వీయ విలువ లోపించి తనను, తన బిడ్డను సంరక్షించుకునే సామర్ధ్యం దెబ్బతింటుంది. చిరాకు, నిర్లిప్తత కారణంగా ఆమెకు బిడ్డతో సరైన బంధం పెంపొందదు. తల్లి మానసిక ఆరోగ్యం ఆమె పనితీరు పై కూడా ప్రభావం చూపుతుంది. తల్లీబిడ్డల మధ్య ఉండే బంధాన్ని, అనుబంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లోనూ, పని చేసే చోట తను రోజువారీ చేసే పనుల్ని, నిర్వహించే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు. ఈ ప్రభావం భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉండే బంధాన్ని బలహీనపరుస్తుంది.
ఉదాహరణకు తల్లి డిప్రెషన్ లేక ఆందోళనకు గురైనప్పుడు తన బిడ్డ అవసరాలకు సున్నితంగా ప్రతిస్పందించలేదు.
మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లికి పుట్టిన బిడ్డల ప్రవర్తన, భావోద్వేగం, ఎదుగుదల పరంగా సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు: తల్లి మానసిక అనారోగ్యాలు బిడ్డల భావోద్వేగస్ధితి, బుద్ధి వికాసం పై ప్రభావం చూపుతాయి. తమకు సంరక్షణ చేసేవారితో జరిపే సంభాషణల ద్వారా బిడ్డలు సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. తల్లి మానసిక అనారోగ్యం ఈసంభాషణ తీరును ప్రభావితం చేస్తుంది. ఇది వారి అభివృద్ధిని, బంధాలనేర్పరచుకునే సామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది.
ఆరోగ్యసేవల వినియోగం: మానసిక అనారోగ్యాల వల్ల చికిత్స కోసం హాస్పటల్కి వెళ్ళవలసిన అవసరం పెరుగుతుంది. హాస్పటల్లో అత్యవసర వార్డులో చేరి చికిత్స చేయించుకోవల్సి వస్తుంది. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అవసరమైన వైద్య సేవల్ని పొందడంపై కూడా తల్లి మానసిక రుగ్మతల ప్రభావం పడుతుంది
మొత్తం జీవిత నాణ్యత: తల్లి మానసిక రుగ్మతలు ఆమె మొత్తం జీవిత నాణ్యతపై, కుటుంబ జీవిత నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది నిరంతర ఒత్తిడికి, జీవితానందాన్ని కోల్పోవడానికి, ఇక బతుకు భరించలేనిదిగా మారడానికి దారితీస్తుంది.
తల్లి మానసిక రుగ్మతలు- బిడ్డ అభివృద్ధి, అనుబంధంపై ప్రభావం
తల్లి మానసిక ఆరోగ్యం సవ్యంగా లేకపోతే ఆమె తన ఉద్వేగాల్ని నియంత్రించుకోలేదు, బిడ్డ ఉద్వేగ సూచనలకు సున్నితంగా ప్రతిస్పందించ లేదు. బిడ్డ ఉద్వేగనియంత్రణ నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి తల్లి తగిన ప్రతిస్పందనతో సంరక్షించడం చాలా ముఖ్యం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి భద్రతనిచ్చే అనుబంధం చాలా ముఖ్యం. తల్లి మానసిక ఆరోగ్యం సురక్షితమైన అనుబంధాల్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. డిప్రెషన్, ఆందోళన ఉన్న తల్లులు తమ బిడ్డలు సురక్షిత అనుబంధాన్ని స్ధిరంగా పెంపొందించుకోవడానికి తోడ్పడలేరు. బిడ్డ, తల్లితో గాఢమైన అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన తల్లీబిడ్డల ఊసుల కలబోతలు తల్లి మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే సాధ్యమవుతుంది. బిడ్డల తొలి వయసులో నేర్చుకునే సామర్ధ్యాన్ని, మెదడు అభివృద్ధి చెందడాన్ని పెంపొందించే కార్యక్రమాలలో మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లులు లీనమవడం కష్టమవుతుంది. తల్లీబిడ్డలమధ్య జరిగే ముచ్చటైన సంభాషణ బిడ్డ భాష అభివృద్ధి అవడానికి కీలకం. ఆ పిల్లలు దీనికి కూడా దూరమవుతారు. మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోని తల్లుల బిడ్డలకు ఎదుగుదలలోపాలు, ప్రవర్తన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
బిడ్డ భావోద్వేగ, సాంఘిక, మేధోపరమైన అభివృద్ధిని కుంటుపరుస్తాయి.
తల్లి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు:
బ గర్భం సమయంలో వచ్చిన డయాబెటిస్, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకమునుపు ప్రసవం
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ లేకపోవడం
బ ఆర్ధికపరమైన ఒత్తిడులు
బ భర్తతో సంఘర్షణలు, గృహహింస
బ కోరుకోకుండా వచ్చిన గర్భం
బ గర్భస్రావం, బిడ్డ ప్రసవ సమయంలో చనిపోవడం, కష్టపు కాన్పు మొదలైనవి.
రక్షణనిచ్చే అంశాలు:
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య కార్యకర్తల బలమైన సపోర్ట్
బ గర్భం సమయంలో నాణ్యమైన సంరక్షణ లభించడం
బ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం
బ భర్తతో సానుకూల అనుబంధం
బ సమర్ధవంతంగా ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం
బ అర్ధిక సుస్ధిరత
బ విద్య, ఉద్యోగ, వృత్తిపరమైన సాధికారత
బ సంస్కృతీపరమైన, సాంఘిక అంశాలు
బ తల్లి మానసిక అనారోగ్యాల్ని సత్వరం గుర్తించి చికిత్స చెయ్యడం
బ తల్లి మానసిక ఆరోగ్యంపై సానుకూల, ప్రతికూల అంశాలను గర్తించి సానుకూల అంశాలను పటిష్టం చేసి ప్రతికూల అంశాలను తగ్గించడం ద్వారా తల్లి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
తల్లి మానసిక అనారోగ్యాలు-చికిత్స
తల్లికి వచ్చే మానసిక అనారోగ్యాలను తగ్గించడానికి వివిధ చికిత్సలతో పాటు కొన్ని చర్యలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇవి తల్లికి ఉండే బాధల్ని నయం చెయ్యడం, తట్టుకునే నైపుణ్యాలను, మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.
కాగ్నిటివ్ బిహేవిరియల్ థిరపి (సి.బి.టి)
ఈ చికిత్స లక్ష్యం ప్రతికూల ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చడం. ఈపద్ధతి డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అహేతుక ఆలోచనల్ని పక్కకు తోసి అనారోగ్యాన్ని తట్టుకోవడానికి ఈ చికిత్స పని చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి, ఒత్తిడులను సక్రమంగా నివారించడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది.
ఇంటర్ పర్సనల్ థిరపీ: వ్యక్తుల మధ్య సమస్యల్ని మనసు విప్పి మాట్లాడుకుని, అనుబంధాలను నెలకొల్పుకునే, నిలుపుకునే నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ చికిత్స తోడ్పడుతుంది. మనుషుల మధ్య ఉన్న సమస్యాత్మక సంబంధాలను పరిష్కరించుకోవడానికి, సానుకూల అనుబంధాలను నెలకొల్పుకోవడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
మైండ్ఫుల్నెస్ ఆధారిత చికిత్సలు: మైండ్ఫుల్నెస్ ఆధారిత ఒత్తిడిని తగ్గించుకునే సద్ధతులు, మైండ్ఫుల్నెస్ ఆధారిత కాగటివ్ థిరపీ, మైండ్ఫుల్నెస్ ఆధారిత ధ్యానం, అవగాహన పద్ధతులు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ క్షణంలో జీవించడం, ఆలోచనల్ని, ఉద్వేగాల్ని యధాతధంగా స్వీకరించడం గర్భిణులను, బాలింతలను మానసికంగా దృఢపరుస్తాయి.
కౌన్సిలింగ్: సపోర్ట్నిచ్చే కౌన్సిలింగ్ మానసిక అనారోగ్యాలకు గురైన స్త్రీలకు తమ భావాల్ని, కలతల్ని, అనుభవాల్ని నిర్భయంగా వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. కౌన్సిలింగ్ ఉద్వేగాల్ని నియంత్రించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.
సైకోడైనమిక్ థిరపీ: ఈచికిత్స అపస్మారక ప్రక్రియలను, ప్రస్తుత ఆలోచనలను, ప్రవర్తనలను పాత అనుభవాలు ప్రభావితం చేస్తున్నాయా అనేది అన్వేషిస్తుంది. ఇది బాగా గాఢమైన విచారానికి లోనైన, మానసిక గాయాలు మానని స్త్రీలకు ఉపయోగపడుతుంది. అంతర్దృష్టిని, స్వీయ అవగాహనను, భావోద్వేగ గాయాల్ని నయం చేసుకోవడాన్ని ఈ చికిత్స ప్రోత్సహిస్తుంది.
మందులతో చికిత్స: బాగా తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన ఉన్నప్పుడు మందులు పనిచేస్తాయి. గర్భిణులు, బాలింతలు తమ వైద్యులను సంప్రదించి, మందుల వలన కలగబోవు లాభనష్టాల్ని బేరీజు వేసుకుని వాడాలి. మందులతో సాటు సైకోథిరపీతో సమగ్ర చికిత్సనందించడం అవసరం.
పెరినేటల్ సపోర్ట్ గ్రూపులు: తోటివారి మద్దతును పొందడానికి, తమ అనుభవాలను వెల్లడించి ఆమోదాన్ని పొందడానికి ఈ పెరినేటల్ గ్రూపులు అవకాశాల్ని కలిగిస్తాయి. ఈ గ్రూపులు ఒంటరి భావాన్ని తగ్గిస్తాయి, మానసిక ఆరోగ్య సవాళ్ళను తేలికపరుస్తాయి.
ఫ్యామిలీ థిరపీ: ఈ చికిత్సలో కుటుంబ సభ్యులు భాగం పంచుకునేలా చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాల్ని మెరుగుపరచడానికి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి, తల్లుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిళ్ళను తట్టుకోవడానికి ఫ్యామిలీ చికిత్స ఉపయోగపడుతుంది.
జీవన శైలిలో మార్పులు:
తగినంత పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులు ఇతర చికిత్సలకు పూరకాలుగా పనిచేసి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం: తల్లులకు వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కలిగించడానికి ఒక వారం పాటు ప్రచారం చెయ్యడం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవారాన్ని జరుపుతున్నారు.
లక్ష్యాలు: గర్భిణులకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆరోగ్య సంరక్షకులకు తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన కలిగించడం బాధిత స్త్రీలకు, కుటుంబాలకు ఆసరాగా నిలబడడం, వ్యక్తుల వైఖరులను, సమాజ వైఖరులను ఈ అనారోగ్యాలపట్ల సానుకూలంగా మార్చడం. మానసిక సమస్యలు వచ్చిన వారు తిరిగి మామూలు ఆరోగ్యం పొందడానికి అవసరమైన సమాచారాన్ని అందించడం, తగిన సపోర్టును, సంరక్షణను పొందడానికి సహాయపడడం. తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం 2024 థీమ్ ‘నిన్ను పునరావిష్కరణ చేసుకోవడం’.
గర్భం దాల్చడం, తల్లి అవడం స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం. ఈదశలో వివిధ భావోద్వేగాలకు గురవడం సహజం. కాని ప్రతి ఐదు గురిలో ఒకరు మానసిక రుగ్మతను అనుభవించడం విచారకరం, నివారించగల విషాదం. స్త్రీలు గర్భిణులుగా, బాలింతలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కొంత మెరుగైనప్పటికి ఇంకా పూర్తి స్ధాయిలో తమ స్వరాల్ని వినిపించడానికి ఆటంకాల్ని ఎదుర్కొంటున్నారు. ‘నువ్వు మానసిక సమస్యల కారణంగా దు:ఖపడుతున్నప్పుడు, ఆ దు:ఖం నీ నిత్య జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ఆ దు:ఖం నుండి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నించవచ్చు, సహాయాన్ని పొందవచ్చు. మౌనంగా ఊబిలో కూరుకుపోవద్దు. పెనుగులాడి బయటకురా. స్ధిరంగా నిలబడి జీవితాన్ని ఆనంద దీపాలతో వెలిగించుకో’.
– డా.ఆలూరి విజయలక్మి
98490 22441 ,గైనకాలజిస్ట్, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పటల్, హైదరాబాద్
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతి ఏడాది చదవడం, ప్రచురించడం, కాపీరైట్లను ప్రోత్సహించడానికి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616లో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఓ కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహౌత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది.
రీడ్ యువర్ వే
ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2024 థీమ్ ”రీడ్ యువర్ వే”. పుస్తక పఠనను ప్రోత్సహించడం, పెంపొందించడం అదేవిధంగా పుస్తక పఠనమనే అలవాటుగా మార్చడమే ఈ థీమ్ లక్ష్యం. అలాగే పిల్లలు, పెద్దలను ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఫార్మాట్ లేదా జానర్తో (కథల, నవలల, పోయెట్రీనా, జీవిత చరిత్రలా, జానపద కథల) సంబంధం లేకుండా పుస్తకాలతో నిమగమయ్యే మార్గాలను సూచిస్తుంది. ఈ నాటిలా పుస్తకాలకు నిగనిగలాడే కవర్లు, మృదువైన పేజీలు అప్పట్లో ఉండేవి కావు. వేల ఏండ్ల కిందట చరిత్రపూర్వ నాగరికతలలో రాత వ్యవస్థలు అభివృద్ధి చెందనప్పుడు మట్టి పలకలను ఉపయోగించారు. పాపిరస్ తరువాత అనేక మందపాటి వెదురు పేజీలతో కుట్టిన ఆధునిక పుస్తకాలను పోలి ఉండేలా రూపొందించిన పుస్తకాలు ఉండేవి.
చదవడం ఓ కళ
శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవడం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏది చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైన క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనసులో అవి నిలిచిపోతాయి.
విద్యకు ప్రాతిపదిక పుస్తకం
ఒక ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఈ కింది సందేశం రాయబడి ఉంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే, ఆ దేశంపై అణు బాంబులు లేదా క్షిపణులు ప్రయోగించనవసరం లేదు. ఆ దేశ విద్యా విధానంలోని నాణ్యతను తగ్గించడం, పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు. ఆ దేశ అభివృద్ధిని నాశనం చేయవచ్చు. అయితే ఆ దేశ అభివృద్ధి కొలమానంలో పుస్తక పఠనం, గ్రంథాలయాలు ఉన్నయన్న సంగతి మరవకూడదు. అభివృద్ధికి విద్య ప్రాతిపదిక అయితే విద్యకు ప్రాతిపదిక పుస్తకం. విజ్ఞానాన్ని సంరక్షించుకుని తరతరాలకు అందించటానికి ఎంతో ఉపయోగపడతాయి పుస్తకాలు. వైజ్ఞానిక, సంస్కృతిక, సాహితి రంగాలలో అభ్యుదయానికి పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. పుస్తకాలకు బూజు పట్టకుండా ఉంచగలిగితే జాతి విజ్ఞానవంతమైన మేధోవంతమైన సమాజంగా వెలుగుతుంది.
ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది
పిల్లలకు చిన్నతనం నుండే చదవడం అలవాటు చేయాలి. వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తిని రూపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాయశక్తుల ప్రయత్నించాలి. పుస్తకం అక్షర కృతి దాల్చిన ఆలోచనల సముదాయం. మూసిన పుస్తకపు అరలలో మరకతమణిలా, మిణుగురు పురుగులా ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది. సామాజిక పరిస్థితుల దృష్య్టా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా పాఠకుడు పుస్తకం దగ్గరికి రానప్పుడు పుస్తకం పాఠకుని వెతుక్కుంటూ వెళ్ళాలి. పౌర గ్రంథాలయాల రూపంలో కానీ, పాఠశాల గ్రంథాలయాల రూపంలో కానీ లేదా పుస్తక ప్రదర్శన రూపంలో కానీ ఇది జరగాలి. కత్తికి పదును నిలిచి ఉండాలంటే అప్పుడప్పుడు దానికి పదును పెడుతూ ఉండాలి. లేకపోతే మొద్దు బారిపోతుంది. అదేవిధంగా నిత్యం చదువుతూ ఉన్న మనసు ఉత్తేజం కలిగించే ఆలోచన శక్తిని నిరంతరం పెంపొందించుతూ ఉంటుంది. లేకపోతే మనసు మందగతిగా మారి తెలివితేటలు లేకుండా పోతాయి. పుస్తక పఠనం మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మెదడును నిమగం చేయడానికి, మానసిక కార్యకలాపాలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
పుస్తకం వినోదానికా, వికాసానికా
పుస్తకాలు వికాసానికే చదవాలని కొందరు, వినోదానికే చదవాలని మరికొందరు వారి వారి అభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు. అయితే రెండు అభిప్రాయాలు సరికాదు. పుస్తకాలు చదువుకోవడం మనోవికాసానికో, వినోదానికో కాక విజ్ఞానానికి ఉపయోగపడతాయి. మానవ జీవితంలో వినోదం ఒక భాగమై పెనవేసుకున్నది. అయితే అది సభ్యమైనదై ఉండాలి. అన్నం తినేటప్పుడు నంచుకోవడానికి పచ్చళ్ళు అవసరమే. అయితే అన్నానికి మించి పచ్చళ్ళు ఉండరాదు. అందుచేత వికాసం మధ్య వినోదం నంజుకునేదిగా ఉండాలి. అంతేగాని అంతకు మించింది కారాదు. మనసు విశ్రాంతికి వినోదం కొంత పాలు అవసరమే. అయితే వినోదం కోసం చదివే పుస్తకాలు మన వికాసానికి కూడా దోహాదం చేసేవిగా ఉండాలి. కానీ మనసు ఉద్రిక్త పరిచేవిగా, మనసును బండ బారించేవిగా ఉండరాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితిలలో అకాడమిక్ పుస్తకాలే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధిలో, మనం చదువుకునేటువంటి విభాగంలో నూతన పోకడలు ఏమైనా వస్తున్నాయా, నూతన పరిణామాలు, నూతన ఆవిష్కరణలు వస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలను చదవాల్సిందే, వాటిని అవగతం చేసుకోవాల్సిందే.
ఎటువంటి పుస్తకాలు చదవాలి
ప్రచురించబడిన ప్రతి పుస్తకం ప్రతి మనిషికి అవసరం లేదు. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి. కొన్ని జీర్ణించుకోవాలి. కొన్ని నెమరు వేసుకోవాలి’ అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రయిత బేకన్. పుస్తకాలు ఎలా చవాలో మహాకవులు, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కానీ నేటి యువత పద్ధతి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. బాగా చదవివే అలవాటున్న వారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటి వారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనడానికి ఖర్చు చేస్తారు.
శాశ్వతమైన స్నేహితులు…
పుస్తకాలు చదవడం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు… ఇవి ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు, భవనాలు కూలిపోవచ్చు. కాని పుస్తకాలు నశించవు. అశాంతియ క్షణాల్లో, నిరాశా నిస్పృహల్లో, ఒంటరితనంలో పుస్తకమే మనకు నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దు:ఖాలలో మనకు తోడు. ఎంతో వెన్ను దన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు.
మంచి పుస్తకం మానవునికి ఎనలేని ఓర్పును అలవరుస్తుంది. లేని ఉల్లాసాన్ని వనగూర్చును. పుస్తకం అనేది ఊహాశక్తిని రేకెత్తించే పరికరం అని బెన్నెట్ మహాశయుడు చెప్పినట్లు గొప్ప వ్యక్తుల, రచయితల, సాహిత్యకారుల మదిలో వెలిగిన అక్షర రూపమే పుస్తకం. అటువంటి పుస్తకం అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది, విలువలను కాపాడుతుంది, సమాజ మనుగడను, ప్రపంచ పోకడలను గ్రహించి, నూతన పరిణామాలను ఆవిష్కరించి సమాజానికి అందజేస్తుంది. మీ సహనానికి అనుగుణంగా ఎంత విజ్ఞానం ఉంటే అంత విజ్ఞానాన్ని జుర్రుకోవచ్చు. జ్ఞాన తృష్ణను పెంచే పుస్తకాలు చదివిన కొలది విజ్ఞత పెరిగి, ఆలోచన శక్తిని తీవ్రతరం చేస్తాయి.
క్రమం తప్పకుండా చదివితే…
పుస్తకం చదవడం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పొందడమే కాకుండా నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని అనేక పరిశోధనలలో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా తమ స్నేహితుడిని (పుస్తకాన్ని) తీసుకువెళతారు. పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. శరీర పోషణకు ఆహారపానీయాలు ఎలా అవసరమో అట్లే మెదడు పెంపొంది సమస్థితిలో ఉండాలంటే దానికి కూడా సరైన ఆహారం అవసరం అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శరీరాదరణకు అవసరమైన నిత్యక్రియలు ఏ విధంగా మన నిత్య జీవిత విధానాల్లో భాగమైపోతాయో అట్లే గ్రంథ పఠనం కూడా నిత్యజీవిత విధానంలో ఓ భాగమై పోవాలి. పది పూటలు గడగడ చదవడం కంటే ఒక పూటను చక్కగా అర్థం చేసుకొని చదవడం వలన ఎక్కువ విజ్ఞానం లభిస్తుంది.
ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి
పుస్తకాలను చదవడం అనేది మీరు తాదాత్మ్యతను, భావోద్వేగ మేధస్సును పెంపొందించుకోవడానికి, విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. విభిన్న పాత్రలు, కథాంశాలలో మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడం ద్వారా, మీరు మానవ స్వభావం, భావోద్వేగాల గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. ఇది మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు మీ ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి. దృశ్యాలు, పాత్రలను, అదృశ్యమానం చేయడంలో మీకు సహాయపడతాయి. ఇది పిల్లలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పఠనం మీ సొంత రచనను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. కమ్యూనికేషన్ గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత ఆగమనాన్ని ఆలస్యం చేస్తుంది.
దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో…
పుస్తకాలను చదవడం వల్ల విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ నైపుణ్యాలు వృద్ధి చేసుకోవచ్చు. చదవడం ద్వారా వ్యక్తిగత, వృత్తి జీవితంలో వచ్చే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విభిన్న దృక్కోణాలను అన్వేషించడానికి, ఇతరుల అనుభవాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చదివే చర్య మెమరీలో సమాచారాన్ని ఎన్కోడ్ చేయడానికి కూడా సహకరిస్తుంది. ఇది తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం సులభం చేస్తుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడులు నుంచి తప్పించుకోవడానికి గొప్ప ఆధారం పుస్తకాలు.
మనిషిని శిల్పంలా మారుస్తుంది
భౌతిక పుస్తకాలతోనే కాదు డిజిటల్ పుస్తకాలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే భౌతిక పుస్తకాలు స్పర్శ అనుభవాన్ని అందిస్తాయి. డిజిటల్ పుస్తకాలు సౌకర్యవంతంగా, సులభంగా మనకు అందుబాటులో ఉంటాయి. అంతిమంగా అన్ని పుస్తకాలు ప్రయోజనాలను అందిస్తాయి. కానీ నాన్-ఫిక్షన్, ఎడ్యుకేషనల్ బుక్స్ వంటి కొన్ని శైలులు నేర్చుకోవడానికి, లోతైన ఆలోచన కోసం మరిన్ని అవకాశాలను అందిస్తాయి. ఈ రకమైన పుస్తకాలు పాఠకులకు కొత్త నైపుణ్యాలను పెంపొందిస్తాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని శిల్పంలా మారుస్తుంది. కనుక చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి. ప్రతి వారికి సొంత గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. మండల, జిల్లా, పాఠశాలల్లో పుస్తక పఠన(రీడథాన్) నిర్వహించాలి. పుస్తక పఠనం అనేది పాఠశాలల నుండి, గ్రంథాలయాల నుండి ఇంటికి ఎగబాకే సంస్కృతిని అలవరచాలి. పుస్తక పఠనం జీవితంలో నిత్యావసరంగా మారిపోవాలి. జీవితంలో మమేకమైనప్పుడు పుస్తకం ప్రధాయినగా వెలుగొందుతుంది.
ఆలోచన ఆకాశమంత
జ్ఞానం అందనంత
ఎవరికైనా సాధ్యమా
బాబాసాహెబ్ అంత…
నిచ్చెన మెట్ల కులపీడన
సర్వం బ్రహ్మ సష్టియన్న
కుహనా సంస్కతుల ఎదురు దాడులు
సిద్ధార్థ, ఫూలే, పెరియార్, నారాయణగురు…
అడుగు జాడలు
మార్క్స్, హెగెల్, గెలీలియో, డార్విన్…
నిత్య సత్య శోధన
దోపిడీ దురహాంకార దుష్టుల
గుండెలు పిండంగా…
సర్వశక్తులొడ్డి
సాటి లేని, పోటి లేని
ధీటైన సమాధానం
మా బాబా సాహెబ్
జ్ఞానానికే ప్రతీక
సపరిత్యాగ సంఘసంస్కర్త
సామాజిక న్యాయ నిర్ణేత
ప్రపంచ అగ్ర రాజ్యాంగ నిర్మాత
ఇజం నేర్పిన భారతరత్న
మా బాబా సాహెబ్
విశ్వ సత్యమెరిగిన విశ్వంభర
అవని మెచ్చిన అవనీష
సహదయ భాష్కర
సర్వే జన భవదీయ
సమైక్య స్వరాగ
సుజ్ఞాన చిరాగ
మా బాబా సాహెబ్
ఓ స్వరాజ్య స్వాప్నిక!
మీ అడుగు జాడలే మా జ్ఞాపిక
మిము విడిచి మేము లేమిక
మిము విడిచి మేము లేమిక
– మహేష్ దుర్గే, 9700888972
ఐన్ స్టీన్ ఒక మాట అన్నాడు, »»Science without religion is lame, religion without science is blind” అని. నిత్య జీవితానికి విస్తృత అర్థం చెప్పే ఉద్దేశం కాదు కానీ, కొంతనైనా భౌతిక శాస్త్ర దృష్టి, కొంతనైనా తత్త్వజ్ఞానమూ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నటువంటి మననుషులు కాస్త ప్రత్యేకంగా ఉంటారు. విశాలభావాలు కలవారికి ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. భారతీయ సంప్రదాయంలో తెలుగువారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు భారతీయ కాలమాన ప్రకారం, అంతరిక్ష, ఖగోళ, భూగోళ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళ జీవన విధానానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఏర్పరుచుకున్నారు. ఏడాదికి 360 రోజులని అరవై ఏళ్ల చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి 12 నెలలు అని, ఇది సూర్య శక్తి రూపానికి నెలవైన ‘కాలం’ అని అన్నారు. నెలకు 30 రోజులని, 24 గంటలు ఒక రోజు అనీ 60 నిమిషాలు 1 గంట అనీ ఇలా చెప్తూ, వాటికి పేర్లు కూడా పెట్టారు. విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నా, చంద్ర గమనంతో 27 ముఖ్యమైన నక్షత్రాలను గుర్తించి, పేర్లనుపెట్టి, ఆ పేర్లను రోజులకు తిథులు’గా అన్వయించి సూత్రీకరణ చేసుకున్నారు. ఈ వివరాల్లోకి పోకుండా, కొన్ని విషయాలను స్పృశిస్తూ సాగుదాం.
వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శశిర ఋతువులు ఆరు అని, సంవత్సరానికి 12నెలలలో రెండేసి నెలలు ఒక ఋతువు అని పేర్లు నిర్ణయించారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం నెలల పేర్లు పెట్టారు. పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులను కృష్ణపక్షం అని, మళ్ళీ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 రోజులు శుక్లపక్షం అని అన్నారు. పదిహేను రోజులను పక్షం అంటారు. నెలకు 2 పక్షాలు. రెండు చంద్రోదయాల మధ్య కాలాన్ని తిథులతో లెక్కిస్తారు.
ఈ రోజుల నడక అంతా ఇలా పేర్కొన్నారు. మరి కాస్త వివరాల్లోకి వెళ్తే, సూర్యగమనంతో ఏర్పడే వాతావరణాన్ని బట్టి ఋతువులు ఏర్పడతాయి కాబట్టి, వసంత ఋతువు, (Spring) ఉండే చైత్ర, వైశాఖ మాసాల్లో చెట్లు చిగురించి పూలుపూసి ఆహ్లాద వాతావరణం ఉంటుంది. గ్రీష్మ ఋతువు(Summer) జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఎండలు బాగా కాస్తాయి. వర్ష ఋతువు (Monsoon) శ్రావణ, భాద్రపద మాసాల్లో వానలు ఎక్కువగా కురుస్తాయి. శరదతువు (Autumn) ఆశ్వయుజ, కార్తీకమాసాల్లో వెన్నెల బాగా ఉంటుంది. హేమంత ఋతువు (Winter) మార్గశిర, పుష్య మాసాల్లో మంచు బాగా కురుస్తూ చల్లగా ఉంటుంది. శిశిర ఋతువు (Fall) మాఘ, ఫాల్గుణ మాసాల్లో చెట్లు ఆకులు రాల్చి మోడు వారి పోతాయి. ఈ ఋతువులనే మూడు కాలాలుగా నిర్ణయించారు. 1. వేసవి కాలము, 2. వర్షాకాలం, 3. శీతాకాలం అంటూ ఒక్కొక్క కాలం నాలుగు నెలలు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలను అనుసరించి శాస్త్రవేత్తలు నిర్ణయించిన పేర్లు. తెలుసుకోవడానికి అయినా చెప్పడానికైనా సులువైన మార్గంగా ఉండేలా నిర్ణయించారు. ఇలా ఋతువులు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు అంటూ పేర్లు పెట్టారు. మొదటి ఆరు నెలలకు ఉత్తరాయణం, తర్వాత ఆరు నెలలకు దక్షిణాయణం అంటూ పేర్లు పెట్టారు. వాతావరణ, జీవావరణ శాస్త్రాలను పరిగణించి ఇటువంటి విభజన చేశారు. ఇదంతా కూడా ప్రకృతిలో వాతావరణ మార్పులు సూర్యచంద్రుల గమనాల వలన ఏర్పడినవిగా గుర్తించారు. సూర్యచంద్రుల అక్ష సంబంధ విషయాల ఈ సౌరమాన విషయాలన్నీ భూ పరిగ్రహ ఆధారంగా వైవిధ్యమైన కాలానుగుణం మార్పులను బట్టి నిర్ణయించారు. ఈ కొలతలు, పరిస్థితులు అన్నీ కూడా భూ ఉపరితలం మీద ఉండే భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాల ఊహారేఖ వంటివన్నీ సశాస్త్రీయంగా చెప్పినవే. అంతరిక్షంలో ఉండే ఇతర గ్రహాలకు, నక్షత్రాలను, ఖగోళ వస్తువులను, కక్ష్యలో తిరిగే భూ భ్రమణాన్ని గణిత పరంగా నిర్ధారించి చెప్పినవే. వీటినే ప్రజలు వాతావరణంలో వచ్చే ఆయా మార్పులకు అనుగుణంగా ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరచుకున్నారు. ఈ కోణంలో కూడా ఉగాది పండగ చరిత్ర తెలుసుకోవాలి.
ఓ 450 కోట్ల సంవత్సరానలకు పూర్వం భూగోళం పుట్టిందని అంటారు. జలచరాలు జంతువులు, మనుషులలో ఎన్నో పరిణామాల జరిగాయి. ఆది మానవులు ఎన్నో దశలను దాటుకుంటూ ఆధునిక మాడవుడై రాతియుగం నుండి రాకెట్ యుగం వరకు చేసేదే నిరంతర ప్రయాణం. ఎన్నో అభ్యసనలతో, ఎన్నో ప్రయోగాలతో ముందుకు సాగుతున్న జీవనమిది. అన్నీ తెలిసినా మరోసారి తలుచుకోవాలి, ఉగాది గురించి తెలుసుకోవాలి.
ఉగస్య ఆది ఉగాది. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం అనీ, జన్మ అని, ఆయుష్షు అని అర్థాలున్నాయి. మనందరికీ తెలిసిందే ‘ఆది’ అంటే మొదలు అని.
ఉగం+ఆది=ఉగాది. హిందూ ఆచారాలలో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు ఈ ఉగాది, యుగాది సంవత్సరం మొదటి రోజు, చైత్ర పాడ్యమి రోజున ఉత్సవంగా జరుపుకోవడం ముఖ్య ఆచారం. యుగాదే ఉగాది. ఈరోజున్నే సృష్టి జరిగిందని నమ్ముతూ ఏర్పరచిన విశేషమైన రోజు. మార్చ్ నెల చివరలోనో, ఏప్రిల్ నెల మొదట్లోనో ఉగాది వస్తుంది.
ఆకాశంలో గాలి లోపల చలనాంశాణువులు ఉంటాయి. అగ్నిలో తేజోంశాణువులు ఉంటాయి. అలాగే ద్రవంశ్యాణువులు నీరులో ఉంటాయి. కఠినాంశాణువులున్న భూమి వీటికి ధీటుగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన నిశ్చలత్వంతో తన చుట్టూ తాను తిరుగుతూ ప్రాణులకు నిలయమై ఉన్నది భూమి. ఈ పంచభూతాలు సకల జీవకోటికి నిలయం. ఇదో ఎండ్ లెస్ జర్నీ. పరస్పర విరుద్ధంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేశాడు కాబట్టే బ్రహ్మాండ జ్ఞానాన్ని అక్షర రూపంలో నిక్షిప్తం చేశాడు. ఆకాశంలో బుద్ధి, చిత్రం, గ్యాత, అహంకారం, మనస్సు అనే ఐదింటిని కలిపి పంచాకాశం అంటుంటారు. నీటిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఉన్న జల పంచకంగా చెప్తూ ఉంటారు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే పంచకాలను జ్ఞానేంద్రియాలు చెప్పేదే అగ్ని పంచకాలు. ప్రాణ, అపాన, ఉదాన, జ్ఞాన సమానాలకే వాయు పంచకాలుగాను, ప్రాణ పంచకాలుగాను చెప్తారు.
ఇలాంటివి తెలుసు కోవాలి. ఇవన్నీ కూడా విజ్ఞానాన్ని అందించేవే. ఈ పంచభూతాలు ప్రతి జీవికి అవసరం. పరస్పర విరుద్ధాంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేసాడు.
అట్లాగే కాళ్లు, చేతులు, వాక్కు, మల, మూత్ర ద్వారాలైన కర్మేంద్రియాలను పంచభూతాలుగా చెప్తారు. మనస్సు ప్రత్యేకమైనది. ఇట్లా అన్ని విషయాలు చెప్తూ, సమస్త జ్ఞాన ప్రకాశాన్ని తనదైన తెలివిడితో ప్రకృతికి, వాతావరణానికి జతచేసి, తన ఆరోగ్యానికి, ఉనికికి, అవసరాలకి సంబంధించిన విషయాలను పండుగలుగా పేర్లు పెట్టి, ఉత్సవ నియమాలతో ఉత్సవ క్రియలను జరుపుకునే విధానాన్ని ఏర్పరిచాడు మనిషి. ఏ పండగ తీసుకున్నా వాటికి సంబంధించిన ఆహార విషయాలు, ఆచరణ విషయాలు ఇవే చూపిస్తాయి. దీన్నే ఇంటలిజెన్స్ అంటారు. అంటే మహాతత్వం అన్నట్టు! ఇదే విద్యా విజ్ఞాన లక్షణమన్నట్టు! వీటితో అరిషడ్వర్గాలుగా నిర్ణయించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జతచేసి ఆరు రుచులు అంటే షడ్రుచులకు పోలికను చెప్పి మనిషి గుణాలకు రుచులకు సమన్వయం చేశారు. కోరిక, కోపం, వ్యామోహం, అనురక్తి, కండకావరం, ఓర్వలేని తనం అనే ఆరు గుణాలు అంత: శత్రువులుగా పనిచేస్తూ మనిషిని నడిపిస్తుంటాయి. ఇవి సత్వ, రజో, తమో గుణాలతో చెప్పి మనిషిలోని ఇంద్రియాలకు అధ్యక్షస్థానంలో ఉన్న మనసుని మొట్టమొదలు చెప్తారు. ఈ మనస్సుకు చంద్రుని ప్రభావం ఉండడానికి కారణాలను చెప్తారు. కఠినత్వం, గర్వితం కలగల్సిన అహంకారం ఆధారంగా అరిషడ్వర్గాలు పనిచేస్తుంటాయి. భావ వికారాలు, భావ వినోదాలు ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ప్రేరణతో ప్రభావం చూపుతాయి.
భూమ్యాకర్షణ భూతాకాశ శక్తికి, చిత్తాకాశానికి చంద్రునికి, చిదాకాశం సూర్యునికి, నిరాకాశం గెలాక్సీ (Galaxy) అని పేరుతో పిలువబడే నక్షత్రం మండలానికి నిర్ణయించారు. సూర్యుని ఉష్ణ శక్తి, చంద్రుని శీతోష్ణ శక్తి అన్ని ప్రాణులపైన ప్రభావం చూపుతాయి కాబట్టే ప్రకృతి సంబంధితమైన వస్తు గుణ విశేషాలను లెక్కలోకి తీసుకున్నారు. వీటన్నింటి అనుసంధానమే ‘ఉగాది’. Gravitational force, Nuclear force, Electromagnetic force అనేవి శక్తి ప్రేరకాలు. ఇవి దేశ, కాలాలకు సమన్వయించి ఒక సూత్రంలోకి తెచ్చిన భౌతికశాస్త్ర జ్ఞానానికి అద్దం రూపే ఈ ‘ఉగాది’. ప్రాణం మనస్సు ఇంద్రియాల కూడికనే ‘ఉగాది’.
ఫాల్గుణ మాసం వెళ్ళగానే చైత్రమాస ప్రథమ తిథి అయిన పాడ్యమి రోజున సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణిస్తారు. ఇదే వసంత ఋతువు ప్రారంభం. వసంత ఋతువు కంటే ముందు శిశిర ఋతువు ఉంటుంది. చెట్లన్నీ ఎండిపోయి ఉన్న పరిస్థితి నుండి ఒక్కసారిగా చిగురులెత్తి ప్రకృతి మొత్తం అందంగా కనిపించే ఋతువు వసంత ఋతువు. పక్షి సంతతి, జంతు సంతతి పరవశించిపోతుంది. పచ్చని మామిడి చెట్లను చూసి కోయిలలు రాగాలెత్తుతాయి. మనుషులు ఈ శోభాయమానంగా సిద్ధమవుతున్న ప్రకృతిని చూసి చైతన్యాన్ని పొందుతారు. ఈ చైతన్యం అంకురించి ఆశయాలకు దారి చూపే ఋతువు అవుతుంది. అందుకే ఉగాదిని చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు.
ఉగాది పచ్చడి:-
మనుషులు ఆశా జీవులు. ఏడాది మొత్తం ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహల పడుతుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు? జరిగేది జరుగుతుందని ఊరుకోరు. మానవ ప్రయత్నం కొంతైనా చేయాలనంటారు. ఇది ఓ సాధారణ విశ్వాసం. అందుకే ఆరు రుచులతో ఉగాది పచ్చడిని చేసుకొని తినడంతోపాటు పంచాంగ శ్రవణం చేయడమూ చూస్తాం.
ఉగాది పచ్చడిలో ‘మాధుర్యం’ అంటే తీపి- చెరుకు, బెల్లం. ‘ఆమ్లం’ అంటే పులుపు – కొత్త చింతపండు రసం. ‘లవణం’ అంటే ఉప్పు. ‘కటు’ అంటే కారం- మిరియాలు. ‘తిక్త’ అంటే చేదు- వేప పువ్వు. ‘కషాయం’ అంటే వగరు – లేత మామిడికాయలు. ఇవే ఉగాది పచ్చడికి కావలసిన మూల పదార్థాలు. పలుచని కొత్త చింతపండు రసంలో వేప పువ్వు రెక్కలు, చిన్ని మామిడికాయ ముక్కలు, కాసింత మిరియాల పొడి, సరిపడేంత కొత్త బెల్లం, చెరుకు గడల ముక్కలు, చిటికెడంత ఉప్పు వేసి కలిపి చేసిన ‘పచ్చడిని’ నైవేద్యంగా పెట్టి తర్వాత అందరూ ఈ ‘ఉగాది పచ్చడి’ని సేవిస్తారు. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానాదులు చేసి, కొత్త బట్టలు కట్టుకొని దైవ ప్రార్థన ముగించుకొని, రకరకాల పిండి వంటలను వండుకొని కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆనందంగా భుజిస్తారు. సాయంకాలం గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం విని మంచి చెడులను తెలుసుకుంటారు. ఇష్టమైన వాళ్ళను కలుసుకోవడం, పెద్దవాళ్లకు కాళ్లకు మొక్కి దండం పెట్టుకోవడం, గోపూజ చేయడం వంటివి ఆనవాయితీ! ‘ప్రభవ’ నుండి ‘అక్షయ’ వరకు ఉన్న 60 సంవత్సరాల పేర్లలో ‘క్రోధి’ 38 వది. 1965లో క్రోధి నామ సంవత్సరం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మనుషులలో క్రోధాన్ని కలిగిస్తుందన్న అర్థంతో ఉన్న ఈ పేరు లోని పరమార్ధాన్ని గ్రహించాలి. క్రోధం ఎందుకు వస్తుంది? ఎవరిపై వస్తుంది? క్రోధం వస్తే లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఎవరికి వారే ప్రశ్నలు వేసుకొని ఒక మంచి అవగాహనకు రావాలి. క్రోధాల వల్ల ఏ ఉపయోగాలు ఉండవు. అనారోగ్యాలు వస్తాయి! అలసటలు తెస్తాయి!! ఆనందాలను పోగొడతాయి!!! ఇది అర్థమైతే చాలు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’ అని మన పెద్దలు ఎందుకు అన్నారు? ఇందుకే! ఏదో చెడు రాబోతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడితే ఆ చెడు నుంచి కొంతనైనా మనల్ని మనం రక్షించుకుంటాం. రక్షించుకునే ప్రయత్నం చేయాలి. కాస్త ఓపిక, మరికాస్త మంచితనం జత చేసామంటే అన్ని చికాకులను అధిగమించవచ్చు అనేది ‘ఉగాది’ నేర్పించే పాఠం.
2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ. మనసుపై స్వీయ నియంత్రణ లేకపోవడం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అత్యాశ, ఆత్రుత వంటివి విషయాసక్తులుగా ఉండడం వలన మనుషులు అధ:పతనానికి పడిపోతుంటారు. ఇది గుర్తెరిగితే చాలు. పర్యావరణాన్ని పాడు చేసుకోవడం వలన ప్రకృతి ప్రకోపిస్తుంది. ఎండలు అధికమైనా, వానలు అతిగా కురిసినా. అత్యధిక చలి పెరిగిన పర్యావరణాన్ని పాడుచేసే మనుషులే కారణం. ఇదే తమస్సు. అంటే చీకటి. ఆ చీకటి నుంచి వెలుగులోకి పయనిద్దాం.
పిల్లాపాపలతో తల్లిదండ్రులతో హాయిగా ఉండే కుటుంబ జీవితాలను హదయపూర్వకంగా ఆచరిద్దాం. పండగలలో కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి పని చేసుకునే సామరస్య జీవితానికి గొప్ప హేతువులు పండుగలు. శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘క్రోధ’ నామ సంవత్సరానికి ఈ ‘ఉగాది’ పండుగ నాడు ఆహ్వానిద్దాం. ఈ నవవసంతాన్ని కొత్తగా ఆహ్వానిద్దాం.
– డా|| కొండపల్లి నీహారిణి,
9866360082
నిండైన పండుగ!
ఉరుకుల పరుగుల రణగొణ ధ్వనుల్లో
మనల్ని మనం మరచిన వేళ
చెట్టు చెట్టుకీ ఎవరో పిలుస్తూ ఉంటే
అప్పుడు గుర్తొస్తుంది ఆ స్వరమధురం!
ప్రకతి ధర్మానికి పలికే కోయిల రాగం
అర్థమయ్యేక తీయటి ఆలోచనలతో
గుండెల్లో ఆనందానుభూతి ప్రవహిస్తుంది
సూర్యుడే చెబుతాడు వెచ్చగా గిచ్చి మరీ
పూత పరదా కప్పుకొని వేపచెట్టు
పిందె సరదా చెప్పుకొని మామిడిచెట్టు
నూతన వత్సర ఆగమనంగా కనబడగానే
మనసుల్లో పండుగ కళ వెలుగుతుంది
మధుమాసంలోని మాధుర్యమంతా
పుణికి పుచ్చుకొని ఆబాలగోపాలాన్ని
పులకాంకితుల్ని చేసేదే ఉగాది!
పచ్చదనం చిగుర్లు తొడిగిన కొమ్మకొమ్మన
కోకిలమ్మలు సన్నాయి పాడుతుంటే
ఇళ్ల ముంగిట రంగవల్లులు ఒద్దికగా ఒదిగితే
ద్వారాలు మామిడి పత్రహారాలతో
మంగళద్వానాలు పలుకుతుంటే
క్రోధి ఉవ్వెత్తున ఎగసే కడలి తరంగంలా
తెలుగు వాళ్ళ జీవితాల్ని ఆనందాబ్ధిలో
ముంచి ఓలలాడిస్తుంది..
కొత్త వస్త్రాలు పిండి వంటలు ఓ పక్క
జీవన పార్శ్వాల్ని జిహ్వకు పరిచయం
చేసేటి షడ్రుచుల పచ్చడి మరో పక్క
తెలుగు వారి జీవితాల్లో తెలిరేకయై
విచ్చుకొని వికసింపచేస్తుంది ఉగాది!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253
యాది
ఉగాది.. నాకు బాగా యాది
కుమ్మరి బాలయ్య తాత
కుండిచి పోయేది
మా ఊరి సిక్కులోని తొట్ల
మామిడి కాయలు తెచ్చెది
ఇంటేనుక ఉన్న యపచెట్టుకు
పువ్వు తెంపేది
సంతన్న దుకడ్ల
సరుకులు తెచ్చది
పచ్చడి కమ్మగా జేసేది
వడకట్టు అంతా పంచేది
దో స్తుగాల్లు అడిగి మరీ తాగేది
గిప్పుడు ఏది గా ఉగాది..
ప్లాస్టిక్ డబ్బాల
రుచి లేని పచ్చడి
వడకట్టు అంతా వెతికినా
తగేటో ల్లేరి
పండగకు ఊరికి
వచ్చేదే మరిచిరి
వాళ్ళు ఇప్పుడు
పట్నంలో వలస
పక్షులు మరీ
గాప్పటి ఉగాది
మరచిపోని యాది…!
– ఏ. అజయ్ కుమార్
]]>– రచన, 9866717712
]]>ప్రతి రోజూ అబద్దాలు తింటూ, అబద్దాలు తాగుతూ, అబద్దాల గాలి పీలుస్తూ వుంటే నిజం ఎక్కడ మిగులుతుంది? కచ్చితంగా చస్తుంది. కాదు మనకు మనమే సత్యాన్ని హత్య చేస్తున్నామా? అనే భయం వెంటాడుతుంది. ‘జీవన్నాటకం అంటే ఇదేకదా!’ అని సమర్ధించుకునేవారికి కొదవే లేదు. జీవితాన్ని నాటకాన్ని వేరు చేయలేం. రేయి పగలులాగ, చావూ పుట్టకల్లాగ కలిసే వుంటాయని కితాబు ఇచ్చుకునేవారూ లేకపోలేదు.
అయితే ఇక్కడ జీవితంలో అంతర్లీనంగా ప్రవహించే నాటక మౌలిక లక్షణాన్ని మనం గ్రహించాలి. సహజమైన మానవీయ సంబంధాలతో పెనవేసుకు పోయిన జీవన రసభావాలు సత్యం శివం సుందరంలా ఆవిష్కృతమవుతాయి. అందుకే మహాకవి శ్రీశ్రీ ”అందమె ఆనందం – ఆనందమే జీవిత మకరందం” అని తేల్చి చెప్పాడు. సత్యాన్వేషణే కాదు, ఆ సత్యాన్ని అంటే నిజాన్ని నిర్భయంగా చూపడమే నాటకం కర్తవ్యంగా అనాదిగా ముందుకొచ్చింది. భవిత పట్ల, మానవజాతి పట్ల, ప్రకృతి పట్ల, పురోగతి పట్ల అచంచల విశ్వాసం పాదుకొల్పేందుకు నాటకానికి వున్న చరిత్ర అపారం. అంతటి అత్యున్నత స్థానం అధిష్టించింది కనుకనే భరతముని నాట్యశాస్త్రాన్ని పంచమవేదంగా అభివర్ణించాడు.
నాటకం సర్వకళల సమాహారంగా విరాజిల్లి, జీవితానికి ప్రతిరూపంగా నిలవడానికి తార్కాణమిదే.
అయితే నేడు మన ప్రజాస్వామ్య దేశంలో ఫాసిస్టు మతోన్మాద పెట్టుబడిదారీ వ్యవస్థ సకల రాజ్యాంగ విలువలతో పాటు మానవ విలువలను సైతం ధ్వంసం చేస్తున్న తరుణంలో మనం జీవిస్తున్నాం. ఈ దశలో నాటకంపై ఎంతో జాగరుకత, శ్రద్ధ, అవశ్యం. ఎందుకంటే నాటకం నడుస్తున్న కాలానికి ప్రతినిధి అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుకే విశ్వకవి రవీంద్రుడు నాటక కళాభ్యుదయం ఆధారంగానే ఒక జాతి యొక్క సాంస్కృతిక ఔన్నత్యం నిర్ణయించవచ్చని పేర్కొంటాడు.
ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961లో తొలుత ఇంటర్నేషనల్ థియేటర్ ఇస్టిట్యూట్ (ఐ.టి.ఐ) నిర్వహించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది మార్చి 27ను దేశదేశాల్లోని నాటక ప్రియులు, నాటక స్రష్టలు, నాటక కార్యకర్తలందరూ దీనిని ఒక ఆనవాయితీగా శ్రద్దగా జరుపుకుంటున్నారు.
సమకాలీన ప్రపంచంలో మన నాటకం స్థానం ఏమిటి? మనం ఎక్కడ వున్నాం? ఎటువైపుకు దిగజారుతున్నాం? అసలు మనం ఎటువైపుకు వెళ్ళాలి. మన రంగస్థలానికి తగులుతున్న ఆటుపోట్ల మాటేమిటి? నాటకకర్తలుగా మనం నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నామా? కట్టెలూ, శవాలు మాదిరి ఏట్లో కొట్టుకుపోతున్నామా? లేదా ఏటికి ఎదురీదుతున్నామా? జాతిని జాగృతం చేయాలంటే ముందు మనం జాగృతం కావాలి గదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటిని ఆత్మవివేచనాపూర్వకంగా ఈ సందర్భంలో నాటక కర్తలు తమపై తాము సంధించుకుంటారు. విమర్శించుకుంటారు. చర్చించుకుంటారు. ఎన్నెన్నో నాటక పరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆ ఏటికాయేడు ప్రస్తుతం ఉన్నదశలో ఓ దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం తప్పక ఉపయోగపడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ప్రపంచ ప్రఖ్యాత రంగస్థల వ్యక్తి విశ్వశాంతి, విశ్వశ్రేయస్సు కాంక్షించేలా మానవత్వ పరిమళాలు జగమంతా పరుచుకోవడానికి నాటకంగా ఏం చేయవలసి వుంటుందో ఒక సందేశం ఇస్తారు.
అలా ప్రప్రధమంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని 1962లో జీన్కోక్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అదో సత్సంప్రదాయంగా మారింది. కనుకనే ప్రపంచ నాటక ప్రియులందరూ ఆ సందేశం కోసం ఎదురు చూస్తూ వుంటారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు సోత్కర్షలతో గొప్పలకు పోకుండా ప్రపంచం పట్ల, యావత్ మానవాళి పట్ల నాటక ప్రియులు ఓ కర్తవ్య పథ నిర్దేశం చేసుకోవడానికి ఈ దినం అలా ఎంతగానో తోడ్పడుతుంది.
మరో విషయం ఈ సందేశం 50 భాషల్లోకి తర్జుమా అవుతుంది. అన్ని ఖండాల్లోని కోట్లాదిమంది ప్రజానీకానికి ప్రత్యక్ష, పరోక్ష ప్రసారాల ద్వారా ఏకకాలంలో చేరువవుతుంది. ఇదంతా మన రంగస్థలం సజీవంగా ఉండేందుకే కాక మానవ సమాజానికి బాధ్యతగా వుండేందుకు కూడా ఉపకరిస్తుంది.
రంగస్థలం (థియేటర్) – నాటకం (డ్రామా)ను సమానార్ధంలో వాడుతున్నప్పటికీ వేర్వేరుగానే పరిగణించాలి. నాటకం సర్వకళల సమాహారమైనప్పటికీ, నాటకం రంగస్థలంలో ఒక ప్రధాన భాగమే. రంగస్థలం అంటే ప్రదర్శనా కళలు. నాటకం, నాట్యం, జానపద కళలు శ్రవ్య దృశ్యరూపకాలు సమస్తం రంగస్థలంలో భాగంగా వుంటాయి. కాగా మరల నాటకం వేరు, నాటక రంగం వేరు. నాటకాన్ని ఓ ప్రదర్శనగా చూస్తాం. శ్రవ్య నాటకమైతే రేడియోల్లోనూ, ఆడియో రూపంలోనూ వింటాం.
‘వీడు వట్టి నాటకాలోడ్రా..’ అంటే జీవితంలో వాస్తవం కంటే అవాస్తవం, అతిశయోక్తులు ఎక్కువ వుంటాయని అర్ధం. నాటక రంగం అంటే ఆ రంగాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేయడం ముందుకు కొనిపోవడం, రంగస్థల శాస్త్రం ఇప్పుడు పాఠశాల స్థాయినుండి ఇంటర్, డిగ్రీ పోస్ట్గ్రాడ్యుయేట్ స్థాయివరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎడ్యుకేషన్ త్రూ థియేటర్ (రంగస్థల మాధ్యమం ద్వారా విద్యాబోధన) అనేది నేడు కేవలం సాధారణ విద్యాసంస్థలకే పరిమితం కాక పెద్ద పెద్ద ఐ.ఐ.టిల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా), ఎం.ఐ.టి. (మాసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్) వంటి సంస్థల్లో కూడా అమలుపరుస్తున్నారు. కారణం అక్కడ పనిచేస్తున్నవారు శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో క్షణం తీరిక లేకుండా స్పందనా శక్తిని కోల్పోవడం. జడత్వానికి లోనౌతూ యంత్రంలో యంత్రంగా మారిపోతున్నామేమోనన్న భయం. మరల వారిలో మానవత్వ పరిమణాలు, స్పందనలు చిగురించి వికసించాలంటే రంగస్థల కళ అనివార్యమవుతుంది.
‘చెప్తే వినపడుతుంది. చూస్తే కనపపడుతుంది. కానీ చేస్తేనే అర్ధమవుతుంది’. ఇది మానవ జీవన సామెత. అందుకే మనిషికి మానవీయ స్పందనలు అవసరం అవుతున్నాయి కనుకనే రంగస్థలం ఓ శాస్త్రంగా ముందుకొస్తున్నది. తెలుగు నాట దాదాపు 144 ఏళ్ల క్రితం ఆధునిక నాటకం ఆవిర్భవించింది. వాడుక భాషలో ప్లీడర్ నాటకాన్ని (వ్యవహార ధర్మబోధిని) వీరేశలింగం పంతులు రాజమండ్రిలో తన యువ శిష్యగణం 1880లో ప్రదర్శించినప్పటి నుండి తెలుగు ఆధునిక నాటకం మొదలైనట్లు లాక్షణికులు చెప్తున్నారు. బ్రిటీష్ వారి ఏలుబడిలో న్యాయం ఎంతగా అన్యాయం అయిపోతన్నదో చాలా వ్యంగ్యంగా, చమత్కారంగా పంతులుగారు రూపొందించారు. మనవ వ్యవహార జీవితం ఎంత కపటంగా, నాటకీయంగా పరిణమించిందో నాడే కళ్లకు కట్టారు. ఆ తర్వాత గురజాడవారి ‘కన్యాశుల్కం’ ఓ నాటక రాజంగా ఆధునిక మహా కావ్యమైంది. ఆ తర్వాత ఆ వరవడిలో ఎన్నో… ఎన్నెన్నో నాటకాలు, ప్రయోగాలు రంగంలోకి వచ్చాయి. నాటకం కేవలం అలరించడమే కాదు, ఆలోచింపజేయడం అనే విషయం కూడా అవగతమైంది.
సమాజం ఎట్లున్నదో చూపడమే కాదు, ఎట్లుంటే బాగుంటుందో కూడా చూపాల్సిన బాధ్యతను నాటకం భుజాన ఎత్తుకున్నది. ఆ సోషలిస్టు వాస్తవికత రంగంలోకి వచ్చింది. ముందడుగు, మా భూమి వంటి నాటకాలకు తెరదీసింది.
ఒకప్పుడు ప్రాచీన వీధినాటకం, అదే వీధిబాగోతం, యక్షగానం, బయలు నాటకం వగైరా… పద్యాలు, పాటలు, వచనం, దరువులతో వర్ధిల్లింది. పౌరాణిక గాధలేగాక జానపద కథలు కూడా ఇతివృత్తాలై బాలనాగమ్మ వంటి జానపద నాటకాలూ వచ్చాయి. ఇక పద్యనాటకాలు సరేసరి. పద్యం తెలుగువారి హృద్యం. చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకం అప్పట్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట. ఎంతటి భాషా ఔన్నత్యం, భావ ఔన్నత్యం, రాగ ఔన్నత్యం పండిత పామరులకు ఆ నాటకాల ద్వారా సమకూరాయో ఆలోచించుకుంటే చాలు గుండె వుబ్బితబ్బిబ్పై అబ్బురపరుస్తుంది.
బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నాటకం చూడని ముందుతరం ప్రజానీకం వుండరంటే అతిశయోక్తి కాదు. ‘విధి అవశ్య ప్రాస్తంబు, రాజే కింకరుడగు, కింకరుడే రాజగు, కాలానుకూలంబుగా’ అన్న జీవన పరిణామ తాత్వికతతో పద్యమాలపిస్తుంటే, సామాన్యజనం భావోద్వేగ భావనతో రసప్లావితులవుతారు. ఇది కదా నాటకం శక్తీ, నాటకం ప్రతిభ, నాటకం జ్ఞానం నాటకం ప్రాణం అని సమ్మోహితులవుతారు. గాంధీజీ అంతటివాడనే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం సత్య సంధునిగా, మహాత్మునిగా మార్చగలిగింది. ఆధునిక, సాంఘిక నాటకాలు మొదలైన తర్వాత నాటకం జీవితానికి సమాంతరంగా నడిచింది. నడుస్తున్నది. జీవితంలోని కల్మషాన్ని కడిగి పారేయడానికి గొప్ప సాధనమైంది. అక్కడితో ఆగకుండా ఆధునిక వీధి నాటకమై శ్రామిక వర్గానికి పోరాటాయుధమైంది. నాటకం వర్గపోరాటంలో ఓ మిస్సైల్లా ఎలా దూసుకుపోగలదో తెలియజెప్పింది.
– కె.శాంతారావు, 9959745723
]]>ఇంతటితో తృప్తి పడదామా..?
మహిళలపై వివక్ష అనగానే కాలం మారింది. ఇప్పుడు పరిస్థితులలా లేవు అంటారు. నిజమే చాలా మంది పరిస్థితి మారింది. మీ ఇంటి పరిస్థితి మారి ఉండొచ్చు. కానీ భారత దేశంలో ప్రతి మహిళ పరిస్థితి మారిందా? నగరాల్లోనేకాదు, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలలో, మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో? మీ ఇంట్లో పని చేసే మనిషి, మీ ఊరిలో కూలి పనికి వచ్చే మహిళా రైతు వీరందరి పరిస్థితి ఒకలానే మారిందా? స్వేచ్ఛా పరిమితులు ఒక్కో తరానికి ఒక్కొక్క రకంగా మారుతాయి. మీ అమ్మలనాడు అనుకున్న స్వేచ్ఛ మీ తరానికి మామూలయిపోయి ఉండొచ్చు. కానీ ఇంతటితో తృప్తి పడి ముందుకు సాగకుండా ఆగిపోదామా? అలా వీలు కుదరదు కదా! మనం సాధించ వలసింది ఇంకా ఎంతో ఉంది. సాధికారత ఒక వర్గం మహిళకు మాత్రమే సొంతం కాదు. అందరు మహిళలకు అన్ని అవకాశాలు రావాలి. అందుకు అందరం అందరికి తోడ్పడాలి. మహిళలందరిపై సహానుభూతి మహిళా సాధికారతకు దారి. సహానుభూతి లేని అభివృద్ధి వలన అందరికీ న్యాయం జరగదు. అది స్వార్థానికి, హ్రస్వదృష్టికి నిదర్శనం.
– అపర్ణ తోట
[email protected]