మ్యాంగో లస్సీ
కావలసిన పదార్థాలు : మామిడిపండ్లు – రెండు, పెరుగు – రెండు కప్పులు, యాలకుల పొడి – చిటికెడు, పిస్తా తరుగు – ఒక స్పూన్లు, చక్కెర – రెండు స్పూను.
తయారీ విధానం : బాగా పండిన మామిడి పండును తీసుకోవాలి. తొక్కను తీసి గుజ్జునంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. దాన్ని స్పూన్తో బాగా కలపాలి. లేదంటే బ్లెండర్లో వేసి ఒకసారి మెత్తని పేస్ట్లా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు, చక్కెర, యాలుకల పొడి వేసి బాగా కలపండి. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీయండి. పైన పిస్తా తరుగును చల్లండి. ఒక గ్లాసులో వేసుకొని తాగితే మ్యాంగో లస్సి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
ఇడ్లీలు
కావలసిన పదార్థాలు : మామిడి పండు గుజ్జు- రెండు కప్పులు, నెయ్యి – రెండు టేబుల్స్పూన్లు, ఇడ్లీ రవ్వ – రెండు కప్పులు, చక్కెర పొడి – అర కప్పు, యాలకుల పొడి – అర టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, పెరుగు – అర కప్పు, పాలు – అర కప్పు, ఉప్పు – రుచికి తగినంత, జీడిపప్పు – గార్నిష్కి సరిపడా
తయారీ విధానం : బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ నేతిలోనే ఇడ్లీ రవ్వను సన్నని మంట మీద వేయించుకోవాలి. ఒక పెద్ద బౌల్లో మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి, ఉప్పు, పెరుగు, యాలకుల పొడి, మిరియాల పొడి, వేయించిన ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. రెండు గంటల తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకుని పిండి వేయాలి. దోరగా వేయించిన జీడిపప్పు పలుకులను ఇడ్లీ పిండి పైన గార్నిష్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు చిన్న మంటపై వాటిని ఉడకనిస్తే ఎంతో రుచిగా ఉండే మామిడి పండు ఇడ్లీ రెడీ..! ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
ఐస్ క్రీమ్
కావలసిన పదార్థాలు : రెండు పెద్ద పండిన మామిడి పండ్లు, 1/2 లీటర్ పాలు, 200 గ్రా క్రీమ్, 100 గ్రాముల చక్కెర, 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి
తయారీ విధానం : ముందుగా పావు కప్పు పాలను సపరేట్గా తీసుకోవాలి. మిగిలిన పాలను పాన్లో పోసుకుని వేడి చేసుకోవాలి. పాలు మరిగే లోపు.. మామిడిపండు తొక్క తీసి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను, పంచదారను కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత… ముందుగా పక్కన పెట్టుకున్న పాలలో మొక్కజొన్న పిండిని కలుపుకోవాలి.
మరుగుతున్న పాలలో మొక్కజొన్న పిండి కలిపిన పాలు వేసి 5-6 నిమిషాలు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కొద్దిగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అది చల్లారిన తర్వాత అందులో మామిడికాయ గుజ్జు, క్రీమ్ వేసి బీట్ చేయండి. గాలి చొరబడని కంటైనర్లో ఐస్క్రీం కోసం తయారు చేసిన పేస్ట్ను నింపి, దానికి సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలను వేయండి. కంటైనర్ను 7-8 గంటలు ఫ్రిజ్లో ఉంచండి. రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.
జామ్
కావలసినవి కావలసిన పదార్థాలు : రెండు పెద్ద గుజ్జు మామిడి పండ్లు, 1/2 కప్పు పంచదార, మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు.
తయారీ విధానం :
మామిడి పండు గుజ్జును మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జును పాన్లో వేసి 2 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత పంచదార వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్నాక మిశ్రమం గట్టిపడుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక నిమ్మరసం పిండి మిక్స్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత… గాలి చొరబడని గాజు కంటైనర్లో పెట్టుకోవాలి. బయట ఉంచితే నెల రోజులు ఉంటుంది. ఫ్రిజ్లో పెడితే.. సంవత్సరమంతా జామ్ను ఎంజారు చేయవచ్చు.
ఒత్తిడిని జయించాలంటే..
మారుతున్న జీవన విధానం, పని వేళల్లో మార్పులు, మారిన వర్క్ కల్చర్ కారణం ఏదైనా చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ టెన్షన్తో కూడిన జీవితం కారణంగా చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం…
ఎక్కువ సేపు పని చేసి తర్వాత ఏర్పడే ఒత్తిడిని చిత్తు చేయడంలో ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం, ఏకాంత ప్రదేశంలో కూర్చుని, కళ్లు మూసుకుని శ్వాసపై దష్టి పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతీ రోజూ చేస్తే మార్పు మీరే స్పష్టంగా గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.
సంగీతం వినడం వల్ల మాననసిక స్థితితో పాటు భావోద్వేగాలను చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజులో కొంత సేపు సంగీతం వింటే ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది.
ఏదైనా పుస్తకాన్ని చదవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొద్ది సేపు పుస్తకం చదవడం వల్ల మనస్సు టెన్షన్, ఒత్తిడి లేకుండా ఉంటుంది. మనస్సును రిలాక్స్గా ఉంచడానికి చదవడం సులభమైన మార్గం.
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శారీరక వ్యాయామం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ వాకింగ్, యోగా, రన్నింగ్ వంటి వాటితో మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఇక పనిలో ఎంత బిజీగా ఉన్న ప్రతీ రోజూ కొద్ది సేపైనా మీకు కావాల్సిన వారితో మాట్లాడాలని చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపాలి. ఇలా చేయ డం వల్ల ఒత్తిడి బలదూర్ అవుతుంది.