నవతెలంగాణ న్యూఢిల్లీ: నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం… ఒకే ఎన్నికలు (వన్ నేషన్…వన్ ఎలక్షన్) బిల్లుకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల సంస్కరణల పేరుతో పార్లమెంట్, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదం పొందిన దరిమిలా ఈ బిల్లును… ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఆ మేరకే ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును పార్లమెంట్ కూడా ఆమోదిస్తే…. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. ఈ బిల్లుగనుక అమలులోకి వస్తే… లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజులు లేదా మూడు నెలల్లో దేశం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. గతంలో ఈ ఎన్నికలకు సంబంధించి 18,629 పేజీలతో రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.