– ఫైనల్లో విదర్భపై ఘన విజయం
వడోదర (గుజరాత్): విజరు హజారే ట్రోఫీ ఐదోసారి కర్నాటక సొంతమైంది. శనివారం వడోదరలో జరిగిన టైటిల్ పోరులో విదర్భపై కర్ణాటక 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 349 పరుగుల భారీ ఛేదనలో విదర్భ ఆఖరు వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. ఓపెనర్ ధ్రువ్ శోరె (110, 111 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), హర్ష్ దూబె (63, 30 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించినా విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు వాసుకి కౌశిక్, ప్రసిద్ కృష్ణ, అభిలాశ్ శెట్టి మూడేసి వికెట్లు పడగొట్టారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రవిచంద్రన్ స్మరణ్ (101, 92 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు), అభినవ్ మనోహర్ (79, 42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు), కృష్ణన్ శ్రీజిత్ (78, 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్తో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగుల భారీ స్కోరు సాధించింది.