నవతెలంగాణ న్యూఢిల్లీ: చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ – 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు నమోదు చేసింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్(Propulsion Module)ని విజయవంతంగా మళ్లీ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోగాన్ని మొదట అనుకోలేదని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలకోసం పంపిన ఈ మూన్ మిషన్ తాజా రికార్డు మరింత లోతుగా ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జాబిల్లిపై నమూనాలు సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.