సీఎం కేసీఆర్ బహిరంగ సభలో అపశృతి…

– గుండెపోటుతో వ్యక్తి మృతి
నవతెలంగాణ-భువనగిరి రూరల్ :  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో  అపశృతి చోటుచేసుకుంది. సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి సభా ప్రాంగణం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. అదే సమయంలో మెట్టు సత్తయ్య ఆకస్మికంగా కుప్పకూలి పడిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాధితుడు గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్తయ్య మృతి చెందడంతో కొద్ది సేపు ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన మెట్టు సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఆయన పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. అతనికి భార్య ఇంతకు ముందే చనిపోవడంతో, ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే సత్తయ్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Spread the love