IPL : ప్లేఆఫ్కు చెన్నై సూపర్ కింగ్స్..

హైదరాబాద్-నవతెలంగాణ : చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 70 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్ కు చేరుకుంది. 14 మ్యాచుల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించిన ధోనిసేన..ప్లేఆఫ్ లో అడుగుపెట్టింది. కెప్టెన్ వార్నర్ (86) ఒంటరి పోరాటం చేసినా ..జట్టును గెలిపించలేకోపోయాడు. టపాటపా.. 224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వద్ద పృథ్వీ షా తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాల్ట్ (3)ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోసోను చాహర్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో కెప్టెన్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. యశ్ దుల్(13), అక్షర్ పటేల్ (18) తో కలిసి మోస్తరు భాగస్వామ్యాలను నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో యశ్ ధుల్, అక్షర్ పటేల్ ఔటడంతో ఢిల్లీ 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా..వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. ఇదే క్రమంలో 58 బంతుల్లో 5 సిక్సులు, 7 ఫోర్లతో 86 పరుగులు సాధించాడు. అయితే 18ఓవర్లలో ఔటయ్యాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివరకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడిపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు, మహేష్ తీక్షణ, పతిరణ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. తుషార్ దేశ్ పాండే, జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది.

Spread the love