నవతెలంగాణ – బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు రూ. పదివేల జరిమానా విధించింది. తమపై నమోదైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ను రద్దు చేయాలని కోరుతూ సిఎం సిద్ధరామయ్య, తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు జస్టిస్ కృష్ణ దీక్షిత్ బెంచ్ మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో సిద్ధరామయ్య సహా కేబినెట్ మంత్రులు ఎం.బి. పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మార్చి 6న సిఎం సిద్ధ రామయ్య, 7న రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, 11న కాంగ్రెస్ కర్నాటక ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలా, 16న పరిశ్రమలశాఖ మంత్రి ఎంబి. పాటిల్ కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. బెలగావికి చెందిన సంతోష్ పాటిల్ కాంట్రాక్టర్, బిజెపి నేత. ఆయన ఉడుపిలోని హోటల్లో 2022 ఏప్రిల్ 12న ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కెఎస్.ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై అధికారిక నివాసానికి కాంగ్రెస్ నేతలు 2022 ఏప్రిల్లో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.