తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగం చట్టరీత్య నేరమని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో చైనా మాంజాను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సహకారంతో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అశోక్ రోడ్ లోని లక్ష్మీ సీజనల్ షాప్ లో ఓనర్ శ్రీనివాస్ వద్ద రూ. 50వేలు విలువచేసే నిషేధిత చైనా మాంజ లభ్యమైనట్టు తనపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుకాణాల యజమానులకు వర్తక వ్యాపారులకు నిషేధిత చైనా మాంజాను విక్రయించినట్లయితే వారిపై నూతన చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ప్రజా జీవన విధానానికి, పశువులకు ఆపదను కలిగించే చైనా మాంజా వినియోగం ప్రమాదకరమని తెలియజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ సునీల్ రెండవ పట్టణ సీఐ కరుణాకర్ సిబ్బంది పాల్గొన్నారు.