నవతెలంగాణ – హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్ మాడ్యూల్ను చేర్చిన మొట్టమొదటి దేశంగా ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. ఇస్రో శాస్త్రవేత్తలకు, ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజు. భవిష్యత్లో ఇస్రో చేపట్టే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్-3 విజయం గొప్ప ప్రేరణను ఇస్తుంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజయ పరంపరను కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.