నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగాల్ రాజకీయాల్లోనూ ప్రకంపనలకు దారి తీసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నబన్నా అభియాన్ ర్యాలీ జరిగింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ పరువు తీయడమే బీజేపీ బంద్ లక్ష్యమని అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. బంద్కు తాము మద్దతివ్వడం లేదన్నారు. రేప్ కేసుల్లో ఉరిశిక్షే సరైందన్నారు. వచ్చేవారం సమావేశాలు ఏర్పాటు చేసి రేపిస్టులకు కఠిన శిక్ష పడేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తామన్నారు. గవర్నర్ దానిని ఆమోదించకుంటే రాజ్భవన్ ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు.