సీఎం రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి..గడువు పొడిగించిన కేంద్రం

నవతెలంగాణ-హైదరాబాద్ : స్మార్ట్ సిటీ మిష‌న్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్​, కరీంనగర్​ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తయ్యాయి. రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి తెలియజేశారు.
స్ట్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కానందున, ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.

Spread the love