నవతెలంగాణ – హైదరాబాద్
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆదివారం మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను” అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. కాగా మోడీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్రెడ్డి (క్యాబినెట్ మంత్రి), బండి సంజయ్ (సహాయ మంత్రి) చోటు దక్కించుకున్నారు. అలాగే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మినిస్ట్రీ దక్కించుకోగా.. పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ మంత్రుల బెర్తులు దక్కాయి.