నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-విజయోత్సవాలు’ పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వరంగల్ బయలుదేరడానికి ముందు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ చైతన్య రాజధాని వరంగల్ అంటూ ట్వీట్ను ప్రారంభించారు. “కాళోజీ నుంచి పీవీ వరకు, మహనీయులను తీర్చిదిద్దిన నేల… స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ… హక్కుల కోసం పోరాడిన సమ్మక్క సారలమ్మ నడయాడిన ప్రాంతం… దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం… ఈ వరంగల్” అంటూ రాసుకొచ్చారు. వీరందరి స్ఫూర్తితో… మనందరి భవిష్యత్తు కోసం… వరంగల్ దిశ-దశను మార్చేందుకు ఈరోజు వరంగల్ వస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, వరంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు.