ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 72 అర్జీలను స్వీకరించారు. రెవిన్యూ శాఖ 55, ఎంప్లాయిమెంట్ 5, పంచాయతీ రాజ్ 4, అటవీ శాఖ 2, మున్సిపాలిటీ 2, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.