– మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా తీవ్ర పరిణామాలు తప్పవు: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు
చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.24 గంటలు దాన్యం కొనుగోలు పై మానిటరింగ్ కొనసాగుతుంది. ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు హెచ్చరించారు. సంబంధిత అధికారులతో కలిసి సూర్యాపేట మండలం ఇమాంపేట, పెన్ పహాడ్ మండల పరిధిలో పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులపై ఆరా తీసి, ధాన్యం కొనుగోళ్ళ పై అక్కడి రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 295 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నామని సమస్యలు లేకుండా ధాన్యం అమ్మకాలు సాఫీగా జరిగేందుకు, మద్దతు ధర కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు. ధాన్యం అమ్మకాలపై ఎక్కడైనా సమస్య వస్తే నివారించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని సమస్యలు తలెత్తితే రైతులు, నిర్వాహకులు సదరు నంబర్ ని సంప్రదించి పరిష్కారాలు పొందవచ్చని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టినా, మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజన్ ముగిసే వరకు ఎలాంటి సమస్యలు రాకుండా 24 గంటలు సెక్టర్ అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశామని ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా కేంద్రాల నిర్వాహకులు బాధ్యతాయుతంగా రైతులకు సేవలు అందించాలని మార్కెట్ యార్డ్ లో కి రైతులు తరలిస్తున్న ధాన్యం కూడా మిల్లర్లు, ఖరీదుదారులు మద్దతు ధర కల్పిస్తున్నారని ఎవరైనా మద్దతు ధర కల్పించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాణ్యమైన తేమశాతం తక్కువగా ఉండే ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చని రైతులకు కావలసిన అన్ని సౌలతులు కల్పిస్తున్నామన్నారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులో టార్పిలిన్స్ కూడా ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ధాన్యం కొనుగోలుపై మానిటరింగ్ చేస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్. లతా, డిఎస్ఓ మోహన్ బాబు, తాసిల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి మార్కెటింగ్ డిఎం శర్మ తదితరులు పాల్గొన్నారు.
