నవతెలంగాణ – న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సర్క్యూలర్ విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ప్రస్తావించారు.
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ.. ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె తన నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, అశోక్ గెహ్లాట్, గోవింద సింగ్ దోస్తాలు ఉన్నారు. రాయ్బరేలి నుంచి ఎంపీగా ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ పోటీలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక 1999లో తొలిసారి సోనియా ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్లో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోగలదు.