నవతెలంగాణ కోదాడ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ జూలై 2న ఖమ్మంలో లక్షలాది మందితో తెలంగాణ గర్జన సభ ఉంటుంది. ఆ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ప్రకటించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిళ్లగూడెంలో భట్టి పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ నిర్దేశించిన మేరకు భట్టి విక్రమార్క పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆమేరకు అది విజయవంతమైంది. పాదయాత్ర ముగింపు సభలో స్వయంగా రాహుల్ గాంధీ… భట్టి విక్రమార్కను సన్మానిస్తారని తెలిపారు. ప్రజల బాగుకోసం సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఠాక్రే విమర్శించారు. ప్రజల సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటని ఠాక్రే ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి రూ.వేల కోట్లు ఎవరు ఇస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ ఖర్చు పెడుతున్న ప్రతి పైసా తెలంగాణ ప్రజలది కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకు మేలు చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.