జీవన్ రెడ్డి మీద పోటీ చేసేవారు ఆశలు వదిలేసుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాగా పని చేస్తున్నారని, గత ఎన్నికల నాటి కంటే అధిక మెజార్టీతో మరోసారి ఆయన గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగిట మేకపోతును కట్టేసినట్టే అవుతుందన్నారు. కాబట్టి ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేనందుకు ఆశలు వదిలేసుకుంటే మంచిదన్నారు.
ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల త్యాగాన్ని ఆమె ప్రశంసించారు. గత పదేళ్ళలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. మనకు ఇతర రాజకీయ ఆలోచనలు లేవని, ప్రజలకు మంచి చేయాలన్నదే ప్రధాన ఆలోచన అన్నారు.

Spread the love