– త్రిబుల్ ఆర్కు సాంకేతిక, ఆర్థిక అనుమతులివ్వండి
– హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి
– హైదరాబాద్-విజయవాడ ఆరు వరుసల విస్తరణకు డీపీఆర్ ఆమోదించండి
– జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి (159 కిలో మీటర్ల) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దష్టికి తీసుకెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్ను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని చెప్పారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ను అనుసంధానించే ఎన్హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్వత్ మాల ప్రాజెక్ట్లో యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న పది చోట్లా పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్లగొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి
– సింగరేణికి కోల్ బ్లాక్లు కేటాయించండి : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సీఎం వినతి
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్ల్లో సీవరేజీ, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. కిషన్రెడ్డిని గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావాల్సిన చేయూతపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. త్రిబుల్ ఆర్ను నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు ఎన్హెచ్ఏఐ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండిస్టియల్ హబ్లు, లాజిస్టిక్ పార్క్స్, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివద్ధి అవుతాయని సీఎం అన్నారు. ఆర్ఆర్ఆర్ రెండు వైపులా పూర్తికి ఈ రహదారికి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు అని కేంద్ర మంత్రికి తెలిపారు. ఓఆర్ఆర్- ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి రేడియల్ రోడ్లు నిర్మించాలని సంకల్పించామని సీఎం తెలిపారు. పది గ్రీన్ఫీల్డ్ రోడ్లతో పాటు ఓఆర్ఆర్ అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు.
మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీ నగర్-హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50:50 వాటాతో మెట్రో ఫేజ్ను 2 చేప్టటేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ఇప్పటికే కోరిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆ భూముల బదలాయింపుతో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశామని, నిధుల మంజూరుతో పాటు అనుమతులకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆ మొత్తం విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నగరంతో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ.మేర సీవరేజీ నెట్వర్క్ పనులకు రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అమత్ 2 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద దానిని చేపట్టేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో అండర్గ్రౌండ్ డ్రయినేజీ ప్లాన్ను రూపకల్పన చేశామని, రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్లాన్ను అమత్ 2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాలని సీఎం కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అయిన సింగరేణి ప్రత్యక్షంగా 43 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తోందని కేంద్ర మంత్రికి దష్టికి సీఎం తీసుకెళ్లారు. దీర్ఘకాలం పాటు సింగరేణి సంస్థ మనుగడ కొనసాగించేందుకు గానూ గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు హైదరాబాద్ అనువుగా ఉందని, నిపుణులైన కార్మికులు, మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను పరిగణనలోకి తీసుకొని తెలంగాణను సెమీకండక్టర్ మిషన్లో చేర్చాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలతో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సురేశ్ షెట్కార్, బలరాం నాయక్, రఘురాంరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ యాదవ్, జి. వంశీకష్ణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.
కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి
– కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్రమంత్రికి సీఎం కతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నట్టు సీఎం కేంద్ర మంత్రి దష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.