– ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, హిందూత్వీకరణను వెంటనే ఆపేయాలని అఖిల భారత విద్యాహక్కుల వేదిక అధ్యక్షవర్గం సభ్యులు, ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం అఖిలభారత విద్యాహక్కు వేదిక, తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”అన్ని రాజకీయ పార్టీలు- విద్యపై తమ వైఖరి తెలపాలని” రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడు తూ.. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి, అలాగే సమాజంలో అందరికీ సమానమైన విద్య ఎందుకు అందడం లేదో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాజ కీయ పార్టీలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. విద్య పట్ల అన్ని రాజకీయ పార్టీల వారి వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థలను ఎందుకు ధ్వంసం చేసు ్తన్నారో,యూనివర్శిటీలను ఎందుకు సంక్షోభంలోకి నెట్టేస్తు న్నారో పాలకులను నిలదీయాలని కోరారు. ప్రయివేటు విద్య ను ప్రోత్సహిస్తూ విద్యను కాషాయీకరణం చేస్తున్నారని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తున్నారని, ప్రజలను బానిసత్వంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2024 లోక్సభ ఎన్నికలు భారతదేశంలో కీలకమైన వన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యవంతం చేసి విద్య ప్రాధాన్యతను తెలపడానికి కృషి చేయాలన్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ విద్య, సమాన విద్య, ఉచిత విద్య కోసం పోరాడాలని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల ధ్వంసం, ఉపాధ్యాయుల నియామకాలపై నాయకులను నిలదీ యాలని అన్నారు.లేనిపక్షంలో రాబోయే కాలంలో సమాజం పూర్తిగా అంధకారంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణప్ప, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ మెంబర్ ప్రకాష్రావు, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్, పీడీఎస్యూ విజృంభన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజరు, పీడీఎస్యూ నగర అధ్యక్షుడు గడ్డం శ్యామ్, సిటీ సెక్రటరీ శ్రీను, సిటీ జాయింట్ సెక్రెటరీ గౌతమ్ పాల్గొన్నారు.