బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12న రిలీజ్ కానుంది. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
– ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఈ పాత్రను దర్శకుడు బాబీ డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నటిగా నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.
– బాలకృష్ణతో ‘అఖండ, డాకు మహారాజ్, అఖండ-2’ ఇలా వరుస సినిమాలు చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమాలు చేయ లేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను ‘అఖండ’ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఇది కూడా ఘన విజయం సాధిస్తుంది.
– బాబీ అద్భుతమైన దర్శకుడు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణని చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో తమన్ ఒకరు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుంది. ఈ చిత్రానికి పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నాగవంశీ గొప్ప నిర్మాత. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు.
– పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతిలాంటి పెద్ద పండక్కి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది.