– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయం నుండి ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చూడాల న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సాధించిన అభివృద్ధి, చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్దిని వివరించాలన్నారు. గ్రామాల్లో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలని సూచించారు. గ్రామ పారిశుధ్యం, పచ్చదనం తీరును వివరించాలని అదేవిధంగా జాతీయస్థాయిలో సాధించిన అవార్డుల గురించి కూడా తెలియజేయాలని మంత్రి తెలిపారు. ఫోటోలతో పాటు బ్రోచర్ల తయారుచేసి గ్రామాల పంచాలని ఆయన తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీ పీలకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. గ్రామ పారిశుధ్య పనులు మెరుగైన సేవలు అందించిన కార్మికు లకు సన్మానించడంతోపాటు ప్రశంసా పత్రాలను ఇచ్చేందు కు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజరుకుమార్, సీఈవో జానకిరెడ్డి, డీపీఓ తరుణ్ కుమార్, డీఆర్డీఏ అడిషనల్ పీడీ స్టీవెన్ నీల్, డిప్యూటీ సీఈవో సుభాషిని, డీఎల్పీఓ అనిత పాల్గొన్నారు.